తెలంగాణకు సీఈసీ బృందం, పార్టీలకు ఇలా సమయం కేటాయింపు
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం తెలంగాణకు రానుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వస్తున్నారు. హైదరాబాద్లో రెండ్రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. సచివాలయంలోని సీఈవో కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారు. సమావేశానికి 15 నిమిషాల ముందే ప్రాంగణంలో ఉండాలని పార్టీలకు సూచించింది.

సీఈసీ బృందం బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అదనపు సమయం కేటాయించలేమని ఆహ్వానంలో ఎన్నికల కమిషన్ పేర్కొంది. గుర్తింపు పొందిన తొమ్మిది రాజకీయ పార్టీలకు ఈసీ సమయం కేటాయించింది.
బీఎస్పీకి సాయంత్రం 6.30 నుంచి 6.40 వరకు, బీజేపీకి సా. 6.40 నుంచి 6.50 వరకు, సీపీఐకి సా.6.50 నుంచి 7.00 వరకు, సీపీఎంకు రాత్రి 7.00 నుంచి 7.10వరకు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాత్రి. 7.10 నుంచి 7.20కి, ఎంఐఎంకు రాత్రి 7.20 నుంచి 7.30 వరకు, తెరాసకు రాత్రి 7.30 నుంచి 7.40 వరకు, టీడీపీకి రాత్రి 7.40 నుంచి 7.50 వరకు, వైసీపీకి రాత్రి 7.50 నుంచి 8.00 వరకు కేటాయించింది.
ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితా ముసాయిదాను తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం సవరణ చేపట్టనుంది. అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు పదిహేను రోజుల పాటు గడువు విధించింది.
ఈ నెల 25 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 8న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తుంది. ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 2,61,36,776 ఉంది.












Click it and Unblock the Notifications