హంగ్ వస్తే ఏం చేద్దాం: బైక్పై కేసీఆర్ వద్దకు వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం ప్రగతి భవన్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఓవైసీ ద్విచక్ర వాహనం (బైక్) పైన ప్రగతి భవన్ రావడం గమనార్హం. తెలంగాణలో హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై వారిద్దరు చర్చించారని తెలుస్తోంది.
దేవుడి ఆశీస్సులతో కేసీఆర్ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నానని అసదుద్దీన్ అన్నారు. మజ్లిస్ పార్టీ తెరాస పక్షాన ఉంటుందని తెలిపారు. జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగు అన్నారు.
అసదుద్దీన్ ట్వీట్
కాగా, అంతకుముందు అసదుద్దీన్ ఓ ట్వీట్ చేశారు. తాను ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవనున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు కలుస్తానని చెప్పారు. అదే ట్వీట్లో... తమ మద్దతు తెరాసకే ఉంటుందని, కేసీఆర్ సొంతగా అధికారంలోకి వస్తారని భావిస్తున్నామని, జాతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఈ స్టెప్ (తెరాసకు మద్దతు) వేస్తున్నామన్నారు.
మళ్లీ మీరే ముఖ్యమంత్రి
మళ్లీ మీరే ముఖ్యమంత్రి, మెజార్టీ స్థానాల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, మీ వ్యూహం ఫలించింది, ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది, మెజార్టీకి అవసరమైన వాటి కంటే ఎక్కువ స్థానాలే మీకు వస్తాయని అసదుద్దీన్ ఓవైసీ.. కేసీఆర్కు ఫోన్ చేసి అభినందనలు చెప్పారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం సీఎంకు అసదుద్దీన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల సరళి, పోలింగు ఇతర అంశాలపై చర్చించారు.
కేసీఆర్ కృతజ్ఞతలు
మజ్లిస్ పార్టీ తెరాసకు మద్దతు ఇవ్వడం, తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై కేసీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తెరాసను ఆదరించారని, విపక్ష కూటమిని తిప్పికొట్టారని కేసీఆర్ చెప్పారని సమాచారం. మైనార్టీ ప్రాబల్యమున్న చోట్ల టీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు వస్తాయని అసదుద్దీన్ వెల్లడించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ విజయానికి కారణమయ్యాయని, మైనార్టీల సంక్షేమానికి చేపట్టిన పథకాలకు మంచి ఆదరణ లభించిందని చెప్పినట్లుగా సమాచారం.
మేమే గెలుస్తామని కేసీఆర్
తెలంగాణ అంతటా గులాబీ హోరే వినిపించిందని, ప్రజలు తెలంగాణ స్వాభిమానాన్ని చాటారని, తాము ఊహించిన విజయాన్ని అందుకుంటామని, మళ్లీ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఎన్నికల్లో ఎక్కడా కూటమి జాడ లేదని, ఒక్క స్థానం గెలుస్తామని కాంగ్రెస్, టీడీపీలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయని అసదుద్దీన్తో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది.