అసని తుఫాను ఎఫెక్ట్: తెలంగాణలోనూ వానలు, ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్: తుఫాను అసని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తుండగా.. తెలంగాణలోనూ వాతావరణం చల్లబడింది. వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు కూడా వర్షాలు కొనసాగతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి రానున్న మూడు రోజులపాటు ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
తెలంగాణలోని ఆ 8 జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వర్షాలు పడే సమయంలో 30- నుంచి కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు
గురువారం కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలో తీవ్ర ఎండలతోపాటు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. గత రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఎండలు, ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలగొండకు చెందిన గుమ్మడం ఎల్లమ్మ(65), కుమురంభీం జిల్లా కాగజ్నగర్ గ్రామీణ మండలం భట్టుపల్లి పంచాయతీ పరిధిలోని సీబాపుకాలనీకి చెందిన రామగిరి పోచుబాయి(58) మంగళవారం వడదెబ్బతో మరణించారు.
వాయుగుండంగా మారనున్న అసని తుఫాను
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను 'అసని' పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, ఉదయం తుపానుగా బలహీనపడి మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను సుమారు ఉత్తర ఈశాన్య దిశగా పయనించి నరసాపురం, యానాం, కాకినాడ, విశాఖపట్నం తీరం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి బుధవారం సాయంత్రం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి గురువారం ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తుఫాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5కి మీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతుంది.