వేధింపులు: పీఎస్ ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్ఐ
హైదరాబాద్: నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నం చేశారు. సమీపంలోని నీటి ట్యాంకుపైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు, అతని సహచరులు వెంటనే అతడ్నికి కిందికి దించారు.
సమీపంలోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల బాలాపూర్ నుంచి మంచాల పోలీస్ స్టేషన్కు నరసింహను బదిలీ చేశారు. ఈ బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఏఎస్సై నరసింహ ఆరోపిస్తున్నారు.
తనపై ఉన్నతాధికారులకు సీఐ సైదులు తప్పుడు సమాచారం ఇచ్చారని, అధికారులు తనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని నరసింహ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.

ఈ ఘటనలో దాదాపు 35శాతం నరసింహ శరీరం కాలిపోయింది. కాగా, నరసింహ ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సైదులుపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై కూడా విచారిస్తున్నారు. కాగా, గతంలో కూడా ఉన్నతాధికారుల వేధింపులతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
తల్లి గొంతుకోసిన తనయుడు
ఓ దుర్మార్గుడు తన కన్న తల్లి గొంతుకోశాడు. ఈ ఘటన కుమురంభీం కాగజ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగజ్నగర్లోని సర్సిల్క్ కాలనీలో నివాసముంటున్న తాడూరి సంధ్యారాణి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తోంది. సంధ్యారాణికి కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, ఆమె భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు.
సంధ్యారాణి కొడుకు ప్రశాంత్ గత కొంతకాలంగా మద్యం, గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ప్రశాంత్ తనకు పెళ్లి చేయాలని, మద్యానికి డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రశాంత్ తల్లితో గొడవపడ్డాడు.
ఆ తర్వాత గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న సంధ్యారాణి గొంతును కత్తికోశాడు ప్రశాంత్. దీంతో ఆమె కేకలు వేయడంతో ప్రశాంత్ అక్కడ్నుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంధ్యారాణిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు ప్రశాంత్ కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications