2న బోనాలు, 3న భవిష్యవాణి: ఢిల్లీలోనూ వేడుకలు, రూ. 10 కోట్ల కేటాయింపు
హైదరాబాద్: ఆగస్టు 2న బోనాలు, 3న భవిష్యవాణిని నిర్వహించనున్నట్లు తెలంగాణ మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలిపారు. మహంకాళీ అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు.
నగరంలోని ప్రతీ ఆలయాన్ని ప్రభుత్వ నిధులతో ముస్తాబు చేస్తామని తెలిపారు. ఈసారి ప్రభుత్వం తరపున 8చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు పద్మారావు, తలసాని చెప్పారు. 12,00మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 44 సిసి కెమెరాలతో నిఘా పెడతామని తెలిపారు.
బోనాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన బోనాల పండుగపై సోమవారం సిఎం కెసిఆర్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్, సీపీ మహేందర్రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బోనాల ఏర్పాట్లపై పర్యవేక్షణ కోసం హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు తలసాని, పద్మారావు, ఇంద్రకరణ్రెడ్డిని నియమించారు.
నిధుల కేటాయింపు
బోనాల పండుగ కోసం దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేసేందుకు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దేవాదాయ శాఖ నుంచి రూ.5 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా మరో రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు.
నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి ప్రదీప్చంద్రను ఆదేశించారు. కమిటీ, జీహెచ్ఎంసీలు కలిసి బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ను ఆదేశించారు. కాగా, జంట నగరాల్లో 23 నియోజవర్గాలకుగాను రూ.25లక్షల చొప్పున నిధులను కేటాయించారు. జీహెచ్ఎంసీ తరుపున ఈ నిధులు విడుదల య్యాయి.
దేశ రాజధానిలోనూ బోనాలు
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా దేశ రాజధానిలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళీ ఆలయ కమిటీ పేర్కొంది. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి సీఎం కేసీఆర్ తెలంగాణ చరిత్రను దేశవ్యాప్తంగా చాటిచెప్పారని పేర్కొంది. బోనాల ఉత్సవాలకు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించామని వెల్లడించింది. బంగారు తెలంగాణను ఆకాంక్షిస్తూ కేసీఆర్ అమ్మవారికి బంగారు బోనంను సమర్పించుకోవడం సంతోషకరమని తెలిపింది.