విషాదం: పోలియో చుక్కలు వేసిన కాసేపటికి చిన్నారి మృతి
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేసిన కొద్ది సేపటికే ఓ చిన్నారి అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీలకు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. వీరికి రెండు నెలల 16 రోజుల కుమార్తె దీక్షిత ఉంది. ప్రస్తుతం తల్లి చిన్నారితో కలిసి పుట్టింట్లో ఉంటోంది.
కాగా, ఆదివారం ఉదయం 11.45 గంటలకు శంబీపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేయించారు. ఆ తర్వాత పది నిమిషాలకే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే మియాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

చిన్నారి మృతికి పోలీయో చుక్కలే కారణమంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దుండిగల్ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున్ స్పందించారు.
పోలియో చుక్కులు వికటించే అవకాశం లేదని, పుట్టినప్పుడే కొంతమందికి గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉండొచ్చని ఆయన అన్నారు. ఒక్కో సీసాలో 40 చుక్కలుంటాయి. ఈ పాపకు వేసిన తర్వాత మరో 17 మందికి పోలియో చుక్కులు వేశామని, వారిలో ఎలాంటి దుష్పరిణామాలు లేవన్నారు. ఆ పాప మృతికి వేరే ఇతర కారణాలు ఉండొచ్చని వైద్యాధికారిక తెలిపారు.
బండి చెరువులో పడి.. ఇద్దరు మృతి
ఎడ్ల బండి చెరువులో మునుగడంతో తాత, మనవడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వరికోల్ గ్రామానికి చెందిన కాణాల సాంబయ్య, అతని మనవడు అసోల్ ఆర్తికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గ్రామ శివారు నల్లచెరువులోకి ఎడ్లను శుభ్రం చేయడానికి దిగారు. అదే సమయంలో ఎడ్లు ఒక్కసారిగా బెదిరి బండితోపాటు తాత మనవళ్లను చెరువులోకి లాక్కెళ్లిపోయాయి. ఎడ్లబండి బోల్తా పడటంతో అందులోనే ఉన్న తాత మనవడు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications