జానాకు బాహుబలి ఫీవర్: కాంగ్రెసులో ఎవరూ లేరా, మాటల యుద్ధం
జానా రెడ్డి చేసిన బాహుబలి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెసు, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
హైదరాబాద్: బాహుబలి సినీ పరిశ్రమలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ కాంగ్రెసు శానససభా పక్ష నేత కె. జానారెడ్డి ఆ చర్చకు పునాది వేశారు. కాంగ్రెసును గెలిపించడానికి బాహుబలి వస్తాడని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు.
దాంతో బాహుబలి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెసు నాయకులతో పాటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కూడా దానిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. జానారెడ్డికి బాహుబలి ఫీవర్ పట్టుకుందని కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
బాహుబలిలోని సన్నివేశాలను, పాత్రలను నాయకులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. బాహుబలిని పొడిచిన కట్టప్ప ముఖ్యమంత్రి కెసిఆర్ అని కాంగ్రెసు నేత డికె అరుణ వ్యాఖ్యానించారు.
మంత్రి జగదీశ్ రెడ్డి ఇలా...
కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాహుబలి వ్యాఖ్యలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పందించారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాస్తవ పరిస్థితిని అంగీకరించారని, కేసీఆర్ను ఎదుర్కొవడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరనే విషయం తెలుసుకున్నారని ఆయన అన్నారు. అలాగే ఇపుడున్న నాయకులెవరికీ సత్తా లేదని అంగీకరించారని అన్నారు.
కాంగ్రెసులో బిజ్జాళ దేవుళ్లే...
కాంగ్రెస్లో బాహుబలి ఎవరూ లేరని ఏడాది క్రితమే తేలిందని, కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్న నాయకులందరూ బిజ్జాల దేవుళ్లేనని ఖమ్మం శాసనసభ్యుడదు పువ్వాడ అజయ్కుమార్ వ్యాఖ్యానించారు. బాహుబలి-1, 2 అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు రోజులుగా పేర్కొంటున్న వ్యాఖ్యలపై ఆయన శనివారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేసీఆర్ను ఎదుర్కోడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరన్న విషయాన్ని ఆ పార్టీ నేతలే అంగీకరించారని పువ్వాడ అన్నారు.
బాహుబలి ఎవరైనా కావచ్చు...
తమ నేత జానారెడ్డికి బాహుబలి ఫీవర్ పట్టుకున్నట్లుగా ఉందని సీఎల్పీ ఉపనేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బాహుబలి జానారెడ్డైనా కావచ్చు, మరెవరైనా కావచ్చునని ఆయన అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది బాహుబలులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కట్టప్ప కెసిఆర్ అని అరుణ
బాహుబలి -1 చిత్రంలోని కట్టప్పను పోలుస్తూ కేసీఆర్తో పోలుస్తూ కాంగ్రెసు ఎమ్మెల్యే డికె అరుణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కట్టప్ప..బాహుబలి-1లో వెన్నుపోటు పొడిచింది ఆయనే అని అన్నారు. 'బాహుబలి -1 పని అయిపోయిందని, ఇప్పుడు నడుస్తున్నది బాహుబలి-2' అని ఆమె అన్నారు. కేసీఆర్ను ఓడించేందుకు తమలో ఒకరం బాహుబలి అవుతామని డీకే అరుణ అన్నారు. నిన్న అసెంబ్లీలో జానారెడ్డి చెప్పింది కూడా ఇదేనని ఆమె అభిప్రాయపడ్డారు.