చిక్కిన మురుగన్: భార్యతో కలిసి బ్యాంక్ దోపిడీ, సినిమా సగంలో ఆపేశాడు
హైదరాబాద్: బ్యాంకు దోపిడీల్లో పేరు మోసిన బాల మురుగన్ పోలీసులకు చిక్కాడు. ఆస్పత్రిలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న బాలమురుగన్ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏడాదిగా సైబరాబాద్ పోలీసులకు బ్యాంక్ దోపిడీల లీడర్ బాలమురుగన్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. సైబరాబాద్ పోలీసు నిఘాతో అతని ఆచూకీని ఓ ఆసుపత్రిలో కనుగొన్నారు.
బెంగళూరు పోలీసుల సహాయంతో గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో కూడా కేసులు ఉండడంతో వారు మొదట అరెస్టు చేశారు. ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మురుగన్ను పీటీ వారెంట్పై సైబరాబాద్ పోలీసులు తీసుకురానున్నారు.
దక్కన్ బ్యాంక్ దోపిడీ
నిరుడు డిసెంబరు 8 న ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల ప్రాంతంలో బాలమురుగన్ అతని అనుచరుడు దినకర్లు కలిసి దక్కన్ గ్రామీణ బ్యాంక్ను దోచుకున్నారు. కిటికీ గ్రిల్స్ ద్వారా బ్యాంక్లోకి ప్రవేశించి 32 లక్షల నగదు, 7తులాల బంగారాన్ని ఎత్తుకెళ్ళారు. ఆ తర్వాత వారానికి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం గ్రామీణ బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసు పెట్రోలింగ్ వెంటపడడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఇన్నోవా కారులో దొరికిన నెంబరు ప్లేట్లు పోలీసులు జరిపిన దర్యాప్తు బాలమురుగున్ రూట్ను పట్టిచ్చాయి.
అప్పటి నుంచి అతని గురించి గాలిస్తున్న పోలీసులకు పలు కొత్త విషయాలు తెలిసి వచ్చాయి. ఈ క్రమంలోనే అతనికి ప్రాణాంతక వ్యాధి కూడా సోకిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై బాలమురుగన్ వాంటెడ్ గా ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఆన్ని ఆసుపత్రులకు మురుగన్ ఫొటోను పంపించి ప్రాణాంతక వ్యాధితో వచ్చే అతని గురించి సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు లుక్అవుట్ నోటీసులను ఇచ్చారు.
ఫలితంగా ఇటీవల సైబరాబాద్ పోలీసులకు తమిళనాడు, కర్నాటక సరిహద్దులోని తిరువరూర్లోని ఓ ఆసుపత్రి నుంచి మురుగన్కు సంబంధించిన సమాచారం అందింది. వెంటనే మన పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మురుగన్ చికిత్స పొందుతూ ఉండడంతో పీటీ వారెంట్ పై తీసుకురానున్నారు.
వీడనున్న బ్యాంక్ దోపిడీల కేసుల మిస్టరీలు
మురుగన్ పట్టుబడడంతో సైబరాబాద్లోని రెండు, మహబూబ్నగర్ జిల్లా లోని రాజాపూర్, ఆంధ్రప్రదేశ్లోని వరదాయిపాళ్ళేం, రాజంపేట్ బ్యాంక్ల కేసుల మిస్టరీని వీడనుంది. బాలమురుగన్ బ్యాంక్ దోపిడీలు ఓ కలరఫుల్ బాలీవుడ్ సినిమాను తలపిస్తుందని పోలీసులు అంటున్నారు. ప్రధాన అనుచరులైన దినకర్, సురేష్ల కోసం వేట సాగిస్తున్నారు. రికవరీ కోసం మురుగన్ శంషాబాద్ ప్రాంతంలో కోనుగోలు చేసిన ఇళ్ళతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆస్తులపై పోలీసులు గురిపెట్టారు.
మురుగన్ భార్యతో కలిసి బ్యాంక్ దోపిడీలు చేస్తాడు. దోచిన డబ్బుతో సినిమా కూడా తీశాడు. కారు ఎక్కడాంటే అతను ఎవరికీ చిక్కడు. మూడేళ్లుగా సైబరాబాద్ పరిధిలో మకాం వేసి బ్యాంక్ దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు నిద్ర కరువు చేసిన బాలమురుగన్ పోలీసులకు పెద్ద సవాలును విసిరాడు.
దోపిడీకి వెళ్ళే సమయంలో బాలమురుగన్ వెంట తన పెంపుడు కుక్కను ఉంచుకుంటాడు. గ్రేట్ డెన్ జాతికి చెందిన ఈ శునకం లేనిదే బాలమురుగన్ బ్యాంక్ దోపిడీలకు వెళ్ళడని పోలీసు విచారణలో తెలిసింది. కారును తానే డ్రైవ్ చేస్తాడు. ఇన్నోవా వాహనాలంటే అతనికి చాలా ఇష్టం. పోలీసు ఛేజ్ చేసినప్పుడు ఇన్నోవా ఎక్కాడంటే చాలు అతనిని పట్టుకోవడం అసాధ్యమని ఛేజ్ చేసిన పోలీసులే అంటున్నారు.
మొత్తం ఐదుగురు సభ్యులు
మొత్తం ఐదుగురు సభ్యులతో మురుగన్ ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని బ్యాంక్ దోపిడిలే చేస్తూ పోలీసులకు మోస్ట్ వాంటేడ్గా మారాడు. దోచిన డబ్బుతో చేసిన జల్సాలు చివరకు అతనికి ప్రాణాంతక వ్యాధికి గురిచేసిందని పోలీసు తెలిపారు. బంధువైన కారు డ్రైవర్ సురేష్ అందంగా ఉండడంతో అతని పై బాల మురుగన్ అభిమానాన్ని పెంచుకున్నాడు.
ఆ అభిమానంతో డ్రైవర్ను హిరోగా పరిచయం చేస్తూ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా చేసిన బ్యాంక్ దోపిడీలతో వచ్చిన నగదుతో సినిమాకు ప్లాన్ చేసి షూటింగ్ను కూడా సగం పూర్తి చేసి ఆపేశాడని దర్యాప్తులో తెలిసింది.