తొలి ఆరు వరుసల బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మహిళా కూలీ: కేటీఆర్ ఏమన్నారంటే?
హైదరాబాద్: నగర ప్రజల ట్రాపిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో చెమటోడ్చిన ఓ సాధారణ మహిళా కూలీకి అరుదైన గౌరవం దక్కింది.
బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మహిళా కూలీ..
ఓ మహిళా కూలీ చేత ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయించారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కూలీ బాలానగర్ ఫ్లైఓవర్ రిబ్బన్ కట్ చేశారు. ఆమె గత రెండేళ్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంది. ఈ నేపథ్యంలోనే బాలానగర్ ఫ్లైఓవర్ను శివమ్మతో ప్రారంభించారు. అక్కడున్నవారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలుపంచుకునే కూలీలను సరైన విధంగా తాము గౌరవించుకుంటామని కేటీఆర్ తెలిపారు.
ట్రాపిక్ కష్టాలు లేని నగరంగా హైదరాబాద్..
ట్రాఫిక్ కష్టాలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బాలానగర్ ఫ్లైఓవర్కు జగ్జీవన్ రామ్ వంతెనగా పేరు నిర్ణయించినట్లు తెలిపారు. దుర్బరమైన ట్రాఫిక్ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటని అన్నారు. నగరంలో మిగిలిన ఫ్లైఓవర్లు కూడా త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కేంద్రం వైఖరి వల్లే రెండు స్కైవేలు సాధ్యం కావడం లేదని ఆరోపించారు. వంతెనల కోసం అవసరమైన భూములను కేంద్రం వ్వడం లేదని, ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవేలు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Recommended Video
హైదరాబాద్లో తొలి ఆరు వరుసల ఫ్లైఓవర్ బాలానగర్దే..
హైదరాబాద్ నగరంలో ఆరు వరుసలతో నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే కావడం విశేషం. సుమారు రూ. 385 కోట్ల వ్యయంతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 2017, ఆగస్టు 21న కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. 1.13 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో.. 26 పిల్లర్లతో ఈ వంతెన నిర్మానం జరిగింది. ప్రారంభోత్సవంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాలానగర్ ఫ్లైఓవర్తో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.