కాంగ్రెస్ నాయకులకు టీఆర్ఎస్ గట్టి ఝలక్.. తగ్గని రేవంత్.. ముందుంది మొసళ్ల పండగేనా..?
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో జీవో.111ని ఉల్లంఘించి ఫామ్ హౌజ్ నిర్మాణాలు చేపట్టారంటూ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరింది. ఆ ఫామ్ హౌజ్ కేటీఆర్కు చెందినది కాదని.. ఆయన లీజుకు మాత్రమే తీసుకున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. అది కేటీఆర్ ఫామ్ హౌజే అని.. నిబంధనలకు విరుద్దంగా 25 ఎకరాల స్థలంలో దాని నిర్మాణం చేపట్టారని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా ఇరు పక్షాల నేతలు మరోసారి ఢీ అంటే ఢీ అనేలా వ్యాఖ్యలు చేశారు.

అది కేటీఆర్ ఫామ్ హౌజ్ కాదు.. ఆస్తుల లెక్క క్లియర్..
మంత్రి కేటీఆర్ 2009,2014,2018లలో ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లలో తన ఆస్తుల గురించి పూర్తి వివరాలు పేర్కొన్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని.. జన్వాడలో ఉన్న ఫామ్ హౌజ్ ఆయనది కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. గోపన్పల్లిలో దళితుల భూములను కబ్జా చేసిన రేవంత్.. దాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు.

అవన్నీ బయటపెడుతాం.. : బాల్క సుమన్
జీవో.111 పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టింది రేవంత్ రెడ్డే అని బాల్క సుమన్ ఆరోపించారు. వట్టినాగులపల్లిలో జీవో.111 పరిధిలో ఉన్న సర్వే నం.66లో రేవంత్ రెడ్డి,ఆయన బంధువులు,బినామీలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇవే కాదు,రేవంత్ రెడ్డికి సంబంధించి ఇంకా చాలానే బాగోతాలు బయటపెడుతామన్నారు. జీవో.111 పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకుల భూములు,నిర్మాణాలను కూడా బయటపెడుతామని అన్నారు. ఇప్పటికే తమ కార్యకర్తలు జీవో.111 పరిధిలో పలువురు కాంగ్రెస్ నాయకులకు చెందిన భూముల వివరాలు,ఫోటోలు పంపించారని.. త్వరలోనే వాటన్నింటిని బయటపెడుతామని చెప్పారు.

పీసీసీ పదవి కోసమే ఇదంతా..
రేవంత్ రెడ్డి లాంటి నేత రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం అని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. రేవంత్ రెడ్డి తోక పట్టుకుని వెళ్తే కాంగ్రెస్ నాయకులను కూడా నట్టేట ముంచడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగల లెక్కలకు,బ్లాక్ మెయిలింగ్కు కేరాఫ్ అడ్రస్.. పెయింటర్ రెడ్డి.. పెయింటర్ మాస్టర్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మరో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. 2001 నుంచి రేవంత్ రెడ్డిది దొంగ దారే అని విమర్శించారు. కేటీఆర్ను విమర్శిస్తే టీవీలో కవర్ అవుతామనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి తెచ్చుకునేందుకు కూడా ఇవాళ కేటీఆర్ను టార్గెట్ చేయడం పైనే ఆధారపడ్డాడని విమర్శించారు.
Recommended Video

రేవంత్ కౌంటర్ ఎటాక్ రేపు..
మరోవైపు టీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్పై రేవంత్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. 'ముందుంది మొసళ్ల పండగ.. రేపు ఒంటిగంటకు..' అంటూ ట్వీట్ చేశారు. దీంతో రేపు మధ్యాహ్నం ఆయన మీడియా ముందుకు రాబోతున్నానని చెప్పకనే చెప్పారు. అయితే మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పబోతున్నారు.. టీఆర్ఎస్ను ఎలా కౌంటర్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇరు పార్టీల పరస్పర ఆరోపణలు,విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.












Click it and Unblock the Notifications