అధికారంలోకి వస్తే కేసీఆర్ సంగతి చూస్తాం, ‘15 నిమిషాల’ వ్యక్తిని వదిలిపెట్టం: బండి సంజయ్
మహబూబ్నగర్: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సంగతి చూస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గద్వాల్ జిల్లా అలంపూర్ నుంచి బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం సాయంత్రం ప్రారంభమైంది. జోగులాంబ అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. రెండో విడత పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు.
కేసీఆర్పై ఇదే చివరి పోరాటం కావాలి: బండి సంజయ్
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుంటామని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తామని బండి సంజయ్ తెలిపారు. ఏడేళ్లుగా ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచి వరి కొంటామని అనిపించిన ఘనత బీజేపీదేనని అన్నారు. మిర్చి పంట తెగుళ్లు సోకి రైతులు బాధ పడుతుంటే కేసీఆర్ ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తే.. బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళితబంధు కేసీఆర్ ఇవ్వరని అన్నారు. తెలంగాణ ప్రజల్లో మార్పు రావాలని కోరారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఇదే చివరి పోరాటం కావాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
15 నిమిషాల వ్యక్తిని వదిలిపెట్టం: బండి సంజయ్
దేశంలో 80 శాతం ఉన్న హిందువుల గురించి బీజేపీ మాట్లాడకపోతే తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ.. ఈ దేశంలో ఏ మతానికీ.. ఏ వర్గానికి వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పాతబస్తీకి వెళ్లి బీజేపీ మీటింగ్ పెడుతుందా? అని చాలా మంది అన్నారు. చార్మినార్ సమావేశానినికి అనుమతి ఇవ్వకపోతే.. పాతబస్తీ మొత్తం మీటింగ్లు పెడతానని హెచ్చరించినట్లు బండి సంజయ్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నిమిషాల వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వదిలిపెట్టబోమని పరోక్షంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
జోగులాంబ ఆలయాన్ని చూస్తే బాధేస్తోంది.. కేసీఆర్ సంగతి చూస్తాం: బండి
జోగులాంబ ఆలయాన్ని చూస్తే బాధ కలిగిందన్నారు. జోగులాంబ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమ్మవారు ఏం తప్పు చేసిందని దసరా ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని నిలదీశారు. కేసీఆర్కు జోగులాంబ అమ్మవారు అంటే భయం లేదు కానీ.. మజ్లీస్ అంటే భయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులు తిరగదోడి కేసీఆర్ సంగతి చూస్తామన్నారు. రంజాన్ కోసం ప్రత్యేక జీవోలు ఇచ్చారన్నారు. శివమాల, అయ్యప్ప, హనుమాన్ మాల ధరిస్తే బడికి, ఉద్యోగానికి రావద్దన్నారని.. వాళ్లు ఏం పాపం చేశారని మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా పూజలు, భిక్ష తీసుకునే విధంగా జీవో ఇస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ను ఎందుకు ఆధునీకరణ చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
కేసీఆర్ హామీలిచ్చి.. కేంద్రాన్ని అమలు చేయమంటారు: డీకే అరుణ ఫైర్
ఈ సభలో బీజేపీ నేత డీకే అరుణ మాట్లాడుతూ.. నడిగడ్డ పోరాటల గడ్డ అని అన్నారు. గతంలో పలుమార్లు సమస్యలపై మాట్లాడిన కేసీఆర్.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 8ఏళ్లు అయినా నడిగడ్డకు ఆర్డీఎస్ కెనాల్ ప్రాజెక్ట్ సమస్య పరిష్కరించలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద చుక్కనీరు రాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జూటా అని అన్నారు. కేసీఆర్ను ఓడిస్తామని జోగులాంబ అమ్మవారి సాక్షిగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఉద్యోగాల కల్పన లేదని, నిరుద్యోగ భృతి లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని విమర్శించారు. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న కేసీఆర్ సర్కారు.. ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదన్నారు. ఇకపై కేసీఆర్ చెప్పే మాటలు నమ్మొద్దన్నారు. కేసీఆర్ హామీలు ఇచ్చి.. కేంద్రాన్ని అమలు చేయమంటారని డీకే అరుణ దుయ్యబట్టారు.