జాతీయ జెండాకు, రాజ్యాంగానికి అవమానం: కేసీఆర్పై బండి సంజయ్, రఘునందన్ ఫైర్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిజాం పోకడలను అవలంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిజాం పోకడలను అవలంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకల్లో విజయశాంతి, నల్లు ఇంద్రసేనా రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్వకుంట్ల రాజ్యాంగమంటూ బండి సంజయ్ ఫైర్
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్కు దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. అంబేద్కర్, గవర్నర్, రాజ్యాంగం, కోర్టులు, మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని అవమానించారంటూ కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
కేసీఆర్ నిజాం పోకడలను అవలంభిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్కు దేశంలో ఉండే అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ కృషి చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని.. రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు, కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించకపోవడంపై కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలావుంటే, గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు.

జాతీయ జెండాను అవమానించారంటూ కేసీఆర్పై రఘునందన్
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ను, బీజేపీని వ్యతిరేకిస్తున్నామనుకునే మీ నిర్ణయాల వల్ల జాతీయ జెండాకు అవమానం జరుగుతోందని కేసీఆర్ పై మండిపడ్డారు. గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేస్తేనే కరోనా ప్రబలుతుందనడం ఓర్వలేని గుణమని దుయ్యబట్టారు. పరేడ్ గ్రౌండ్స్లో జెండా వేడుకలు నిర్వహించాలన్న కోర్టు మాటను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కడం బాధాకరమన్నారు.

మీ కార్యక్రమాలకు కరోనా ప్రబలదా? అంటూ కేసీఆర్పై రఘునందన్
జిల్లాల్లో జెండా కార్యక్రమాలు రద్దు చేయమని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంతగా రాజకీయాలను దిగజార్చడం బాధాకరమని.. జాతీయ జెండాకు అవమానం చేసినట్లేనని మండిపడ్డారు.
ఖమ్మంలో బహిరంగ సభ పెడితే కరోనా ఉండదా? రేపు మీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం ప్రారంభిస్తామనుకుంటే కరోనా ప్రబలదా? సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించబోయే సభలో కరోనా ప్రబలదా? అని నిలదీశారు రఘునందన్ రావు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుని రాజకీయాలను మరింత దిగజార్చకుండా చూసుకోవాలని రఘునందన్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications