బండి సంజయ్ చెప్పులు మోస్తున్నట్టు ఫ్లెక్సీల కలకలం; భగ్గుమన్న బీజేపీ!!
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నేతల నుండి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించిన నాటి నుండి అడుగడుగున ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇక పోలీసులు ప్రస్తుతానికి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని నోటీసులు జారీ చేసి బండి సంజయ్ ను గృహ నిర్బంధం చేశారు. దీంతో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించాలని భావిస్తున్న బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర తిరిగి కొనసాగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
చెప్పులు మోస్తున్న బండి సంజయ్ ఫోటోలతో ఫ్లెక్సీలు
ఇక ఇదే సమయంలో వరంగల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు వరంగల్ నగరంలో కలకలం రేపాయి. నేను ఢిల్లీ గులాముల చెప్పులు మోసే బానిసను అంటూ బండి సంజయ్ తలపైన చెప్పులని పెట్టుకొని మోస్తున్నట్టు ఫ్లెక్సీలు నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో వెలిసాయి. ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నావ్ అంటూ ఆ ఫ్లెక్సీలో రాసి ఉంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే బిజెపి కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించారు.
టీఆర్ఎస్ నేతల పనే అని మండిపడుతున్న బీజేపీ నేతలు
ఇది టీఆర్ఎస్ పార్టీ నేతల పనే అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు వస్తున్న క్రమంలో టిఆర్ఎస్ నేతలు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ నేతలే కావాలని ఈ తరహా చర్యలతో రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు బీజేపీ నాయకులు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్తున్నారు. తాము కూడా ఎదురుదాడి చెయ్యగలమని చెప్తున్నారు.
అమిత్ షా పర్యటన సమయంలో చెప్పులు అందించిన బండి సంజయ్
ఇక అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి మునుగోడులో సభ నేపథ్యంలో వచ్చిన క్రమంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బండి సంజయ్ చెప్పులు తీసి కాళ్ళ ముందు పెట్టారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పటినుండి బండి సంజయ్ ను ఢిల్లీ గులాములు చెప్పు మోసే బానిస అంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని తెలంగాణాలో గెలిపిస్తే బానిసల్లా బ్రతకాల్సి వస్తుందని చెప్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.
గురువుకు చెప్పులు అందిస్తే తప్పేముంది అన్న బండి సంజయ్
ఇక ఈ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించి అమిత్ షా తనకు గురువు లాంటివారని, ఆయనకు చెప్పులు అందించడంలో తప్పేముందని తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. గురువు పట్ల గౌరవ భావం ప్రదర్శించటం బానిసత్వం ఎలా అవుతుందని నిలదీశారు. ఇక ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటే కొనసాగింపుగా వరంగల్ లో గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ చెప్పులు మోస్తున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మళ్లీ రాజకీయ రచ్చ కొనసాగించారు.