అవి నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటా.. కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండోదశ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకోవడం తోపాటుగా, టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా దేవరకద్రలో బిజెపి ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ పాలమూరు నుండి వలసలు లేవని చెబుతున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లా నుండి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇక టిఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసిన బండి సంజయ్ పాలమూరులో బిజెపి ఎక్కడుంది అని టిఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరులో టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్, టిఆర్ఎస్ వల్ల పూర్తి కాలేదని బండి సంజయ్ విమర్శించారు. రాబోయే ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టాలని, తాము ప్రతి హామీని నిలబెట్టుకుంటామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దేవరకద్ర నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్న బండి సంజయ్ చెక్ డ్యాములు, ఇసుక కాంట్రాక్టులతో టిఆర్ఎస్ నాయకులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అంటూ ఆరోపించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర 21 వ రోజు అయిన మే 4వ తేదీన కోటకద్ర స్టేజ్, చౌదర్పల్లి స్టేజ్, రామచంద్రాపురం స్టేజ్, ఓబుళాయిల పల్లి గ్రామం, ఒట్కుంట స్టేజ్, బొక్కలోని పల్లి స్టేజ్, జమిస్తాపూర్ స్టేజ్, కోడూరు స్టేజ్, మన్నెంకొండ టెంపుల్, ధర్మపురి గ్రామం, మణికొండ స్టేజ్, ఓబుళాయిల పల్లి తండా, అప్పాయిపల్లి మీదగా సాగనుంది.