కేటీఆర్.. ఆ పనులు చేస్తే.. చెప్పుతో కొట్టించుకుంటా.. తల నరుక్కుంటా: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, నిరుద్యోగులందరికీ ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వండి.. చెప్పుతో కొట్టించుకుంటాను, తల నరుక్కుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు .
కవిత, కేటీఆర్, కేసీఆర్ లపై మండిపడిన బండి సంజయ్
గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారని, ఎమ్మెల్సీ కవిత , నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను, కేటీఆర్ తనను చెప్పుతో కొడతామంటూప్రకటన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన తలను ఆరు ముక్కలుగా నరుకుతామని అన్నారని, ఇది దొర అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే దొరలు చెప్పులు మోయిస్తారన్న బండి సంజయ్
జాతీయ రాజకీయాలు చేస్తానంటున్న కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తే ఎవరు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువైందన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే దొరలు చెప్పులు మోయిస్తారని పేర్కొన్నారు. సిరిసిల్ల సంస్థలను అప్పుల పాలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీ నాయకులదన్నారు. సెస్ ను ముంచి కోట్లు సంపాదించిన వ్యక్తుల బండారం త్వరలోనే బయట పడుతుంది అన్నారు. సెస్ ను ఎత్తివేసి బోర్డ్ లో కలపాలని కుట్ర చేస్తున్నారన్నారు.
సెస్ ను నాశనం చేసిన వ్యక్తులకు మళ్ళీ సెస్ అప్పగించాలని చూస్తున్న కేటీఆర్
గతంలో అవినీతికి పాల్పడ్డ దుర్మార్గుల ఆస్తిపాస్తులు జప్తు చేసి సెస్ ను కాపాడాలన్నారు బండి సంజయ్. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో గ్రామపంచాయతీలను కలిపి వాటిని అభివృద్ధి చేయడానికి విస్మరించారని ఆరోపించారు.
సెస్ ను నాశనం చేసిన వ్యక్తులను కేటీఆర్ పక్కన పెట్టుకొని మళ్ళీ గెలిపించి, సెస్ చైర్మన్గా అదే దొంగకు అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ. 33 కోట్లు కుంభకోణం చేసిన వ్యక్తికి మళ్లీ పగ్గాలను అప్పగించాలని మంత్రి కేటీఆర్ చూస్తున్నారన్నారు. ప్రజలు అవినీతి నాయకుల మోసాలను గ్రహించాలన్నారు.
సిరిసిల్ల సెస్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న బండి సంజయ్, సెస్ ను కాపాడే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. సిరిసిల్ల సెస్ ను కాంట్రాక్టర్ల పాలు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారన్నన్నారు. ప్రజల డబ్బుల తో సొంత పేరుతో పథకాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని పేద ప్రజలను ఇబ్బందుల గురి చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్ల సెస్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.