బీజేపీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావటంలేదా? పార్టీనేతలపై బండి సంజయ్ ఆగ్రహానికి కారణమిదేనా?
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకున్న మైలేజ్ రావడం లేదా? తెలంగాణలో బీజేపీ వ్యూహాలను పార్టీ శ్రేణులు పకడ్బందీగా అమలు చేయడం లేదా? బండి సంజయ్ ఆగ్రహం వెనక కారణం అదేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
పార్టీకి అనుకున్న మైలేజ్ తీసుకురావటంలో బీజేపీ శ్రేణులు విఫలం
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా అధికారం కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టి పల్లెపల్లెనా బీజేపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మరోవైపు ప్రజా సమస్యలపై బీజేపీ శ్రేణులు పోరాటాలకు దిగుతున్నారు. జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించుతున్నారు . అయినప్పటికీ తమ పోరాటాలను, పాదయాత్రను ప్రజలలోకి లోతుగా తీసుకువెళ్లడంలో బీజేపీ శ్రేణులు విఫలమవుతున్నారు అన్న టాక్ వినిపిస్తుంది.
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల సమావేశంలో బండి సంజయ్ అసంతృప్తి
ఈ క్రమంలోనే తాజాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో సమావేశమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధులుగా చేయాల్సిన పనులు చేయడం లేదంటూ బండి సంజయ్ వారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలని, వెంటనే స్పందించాలని చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీకి ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని ఆగ్రహం
అధికార పార్టీ విమర్శలపై వెంటనే స్పందించడం లేదని బండి సంజయ్ రాష్ట్ర అధికార ప్రతినిధులకు క్లాస్ పీకారు. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలని బండి సంజయ్ తేల్చి చెప్పారు. అంతేకాదు సమాచార సేకరణలో అధికార ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది అధికార ప్రతినిధులున్నా పార్టీకి ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని, పార్టీకి మైలేజ్ తీసుకురావడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు.
అధికార ప్రతినిధులు రోజుకొకరు పార్టీ కార్యాలయంలో ఉండాలి: బండి సంజయ్
అధికార ప్రతినిధులు రోజుకొకరు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్న బండి సంజయ్, జిల్లాలలో జరిగే ఘటనలపై నేతలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వారికి దిశ నిర్దేశం చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై అలర్ట్ గా ఉండాలని, బిజెపి తరఫున తమ స్పందనను వినిపించాలని బండి సంజయ్ తెలిపారు. నిత్యం ప్రజలకు తామేమి చేస్తున్నామో, తెలంగాణాలో పాలన ఎలా ఉందో తెలియజెయ్యాలని సూచించారు.
బండి సంజయ్ సీరియస్ క్లాస్ తో అయినా నేతలు మారతారా?
ఇటీవల కాలంలో బిజెపి చేస్తున్న అనేక కార్యక్రమాలకు ప్రజా క్షేత్రంలో పెద్ద ఎత్తున మద్దతు లభించడం లేదని భావిస్తున్న క్రమంలోనే బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. మరి బండి సంజయ్ సీరియస్ క్లాస్ తర్వాత అయినా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు బీజేపీని ప్రజాక్షేత్రంలోకి తీసుకోవడంలో సక్సెస్ అవుతారా? బిజెపి పక్షాన టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ ని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది.