Bandi Sanjay: కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే..
ఆరు గ్యారెంటీలు ఒకే కానీ.. రేషన్ కార్డుల సంగతేమిటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. హస్త పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం 6 గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ ఆరు గ్యారెంటీలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు ఉండాలి.. రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని నిలదీశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు.
ఆ దరఖాస్తులన్నీ పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. వెంటనే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 6 హామీలు కొత్త రేషన్ కార్డు దారులకు కూడా వర్తింపజేయాలని కోరారు. లబ్ధిదారులను రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయాలని కోరారు. అన్ని పార్టీలను భాగస్వాములు చేయాలని సూచించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి తబ్లిక్ జామాతే కారణమని గుర్తు చేశారు. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటో వివరించాలన్నారు.
ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థలను ప్రోత్సహిస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్. కాగా కరీంనగర్ నుంచి వారానికి రెండు రోజులు తిరుపతి వెళ్లే రైలు సర్వీస్ ను వారానికి నాలుగుసార్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి బండి కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిశారు.












Click it and Unblock the Notifications