ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?: నియంత అంటూ సీఎం కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని బండి సంజయ్ కోరారు.
'ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి. నియంత వైఖరిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి' అని దుయ్యబట్టారు బండి సంజయ్.
టీఆర్ఎస్ నేతల తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటామని.. ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగిస్తామని సంజయ్ తెలిపారు.
మరోవైపు, ఎంపీ అరవింద్పై దాడిని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోలేకే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్నారు హెచ్చరించారు ఈటల రాజేందర్.