హిందువులపై టీఆర్ఎస్, ఎంఐఎం దాడి, సీపీ రౌడీలా: బోధన్ ఘటనపై బండి సంజయ్ నిప్పులు
హైదరాబాద్: హనుమాన్ భక్తులను లాఠీలతో కొడతారా? హిందువులంటే అంత చులకనా? అంటూ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బోధన్లో హిందూ యువకులపై ఎంఐఎం, టీఆర్ఎస్, పోలీసులు కలిసి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్లో శివాజీ విగ్రహం పెట్టడం కోసం మున్సిపాలిటీ తీర్మానం చేసిందని బండి సంజయ్ గుర్తు చేశారు.
హిందువులపై దాడులు.. సీపీ రౌడీలాగా: బండి సంజయ్ ఫైర్
హిందూ యువకులపై రాళ్ళ దాడి చేయడం మూర్ఖత్వమని, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బోధన్లో శివాజీ విగ్రహావిష్కరణ ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ... నగర సీపీ నానా బూతులు తిట్టి, లాఠీ ఛార్జీ చేశారని మండిపడ్డారు. గాల్లో రబ్బరు బుల్లెట్లు కాల్పులు చేశారు.
నిజామాబాద్ సీపీ గతంలో ఎంపీ అవుతానని ప్రకటించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో కొందరు ఐఏఎస్లు ప్రవర్తిస్తున్నారన్నారని మండిపడ్డారు బండి సంజయ్.
సీపీకి సిగ్గుండాలి, రౌడీలా ప్రవర్తించాడు.. అధికారులు సంఘాలు ఏం చేస్తున్నాయి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. శివాజీ పాకిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా? అని నిలదీశాడు. బైంసాలో జరిగినట్లే బోధన్లో జరిగిందన్నారు. సీపీ లాంటి వాళ్ళని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు బండి సంజయ్.
ప్రభుత్వం శివాజీ జయంతి చేస్తే అడ్డుకుంటుంది. ఎంఐఎం ఏది చెప్తే రాష్ట్రంలో అది అమలు అవుతుందన్నారు. సిరిసిల్లలో 25 మంది బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెట్టారు. టీఆర్ఎస్ గుండాలు దాడి చేస్తే చర్యలు ఉండవు. పోలీసులు టీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
ప్రజా సంగ్రామ యాత్రకు అమిత్ షా: బండి, కేసీఆర్ ది నోరా.. తాటిమట్టా..
ఏప్రిల్ 14 ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కి అమిత్ షాని ఆహ్వానించాం. కేసీఆర్ తప్పు చేసి వివాదాలలో పడ్డాడు. సీఎంకి సిగ్గు ఉండాలి. కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారు. కేంద్రం వడ్లు కొంటాను అని చెప్పింది.. కొనే బాధ్యతలు మేము తీసుకుంటాం. దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుపై పాలసీ ఉంటుంది.
నీ ఏడుపు నువ్వు ఏడువు.. పక్క రాష్ట్రాలు గురించి ఎందుకు? ఇండియా గేట్ దగ్గర, బీజేపీ ఆఫీస్ దగ్గర వడ్లు పోయడానికి జేసీబీలు దొరకడం లేదా? పార్లమెంట్లో ధాన్యం కోనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పీయూష్ గోయల్ క్లారిటీగా చెప్పారు. యూపీఏలో కంటే ఎన్డీ ఏ ప్రభుత్వంలో రెట్టింపు ధాన్యం కొంటున్నాం.
దేశంలో వడ్లు కొనుగోళ్లలో తెలంగాణ రెండో రాష్ట్రంగా ఉందన్నారు బండి సంజయ్. కేంద్రం వడ్లు కొనుగోలుకి 84,120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వానా కాలంలో 40 లక్షలు మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ జరిగింది. అదనంగా 24 లక్షలు మెట్రిక్ టన్నుల కొంటానని కేంద్రం చెప్పింది. బాయిల్డ్ రైస్కి, రా రైస్కి రైతులకి ఏమి సంబంధం? ఇప్పటి వరకు అదనంగా ఇస్తామన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.
ధాన్యం కొనుగోలులో పెద్ద స్కామ్ జరుగుతోంది. వరంగల్లో 40 వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుబడింది. కొనుగోలు కేంద్రాలు ఎత్తి వేస్తామని ఎందుకు ప్రకటించారు. కేసీఆర్ది నోరా.. తాటి మట్టా? తన తప్పులు కేంద్రం పై నెట్టే ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు.
కేంద్రంపై నిందలు వేస్తూ కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్
వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఫాంహౌజ్లో మంత్రులతో మీటింగ్ పెట్టి కేంద్రంపై యుద్ధం చేద్దామని ఏదేదో మాట్లాడుతున్నారన్నారు బండి సంజయ్. వరి కోనుగోలు విషయంలో కేంద్రం రైతులను మోసం చేస్తుందని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
కేంద్రం ధాన్యాన్ని కొంటానని చెప్పిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తున్నట్లు ఎందుకు చెప్పారని కేసీఆర్ని ప్రశ్నించారు. వానాకాలానికి సంబంధించి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని, కానీ కేసీఆర్ ఈ విషయంలో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని వేశాలేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ధాన్యాన్ని కొంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతేగాక, ఢిల్లీ వెళ్లి ఏమి చేస్తావు? నీ ఫాం హౌస్లో వరి వేస్తావు.. రైతులు మాత్రం వద్దా? కేంద్రం ఫిబ్రవరిలో సమావేశము నిర్వహిస్తే ధాన్యం ఇవ్వమని రాష్ట్ర అధికారులు చెప్పారు.
సీఎం డ్రామాలు ఆడుతూ రైతులని ఇబ్బందులు పెడుతున్నారు. తన తప్పులు కేంద్రంపై వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఏమి జరిగిన కేంద్రం అంటాడు. క్యాంటీన్లో ధర్నాలు చేసి పార్లమెంట్ హౌస్లో ధర్నా చేశాము అని వాళ్ళ ఎంపీ లు హడావుడి చేశారని ఎద్దేవా చేశారు.