ప్రధాని వ్యాఖ్యల వక్రీకరణ, కేసీఆర్ మెడలు వంచుతాం: బండి సంజయ్ క్షమాపణలు
వరంగల్: ఉచిత సంక్షేమ పథకాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మంగళవారం జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించారు బండి సంజయ్. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. దేవరుప్పలలో జరిగిన దాడి ఘటనల నేపథ్యంలో పోలీసులు పాదయాత్రకు భారీ బందోబస్తు నిర్వహించారు.
కేసీఆర్ గడీల పాలనకు అంతం పలుకుదాం: బండి సంజయ్
పాదయాత్రకు ప్రజలు రాకుండా పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. చట్టాలను కాపాడాల్సిన స్థానిక సీపీ.. టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యమ ద్రోహుల రాజ్యం నడుస్తోందని, నిజాం రాజుల పాలన సాగిస్తున్న కేసీఆర్పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. తెగించి కొట్లాడి కేసీఆర్ గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టాలన్నారు.
కేసీఆర్ మెడలు వంచైనా విమోచన దినం జరిపిస్తాం: బండి సంజయ్
తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించేలా కేసీఆర్ మెడలు వంచుతామన్నారు. సీబీఐ వల్లే కేసీఆర్ చేసిన అవినీతి అందరికీ తెలిసిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు ఊహించని స్పందన కనిపిస్తోందని.. అందుకే అధికారం పోతుందని భయం కేసీఆర్ పార్టీలో కనపడుతోందన్నారు. దుకాణాలు బంద్ చేస్తే జనాలు రారనుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
మోడీ వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారంటూ బండి సంజయ్
పేదలకు మేలు జరగాలనేది ప్రధాని మోడీ ఉద్దేశం. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కనీసం సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ప్రధానికి సమైక్య స్ఫూర్తి లేదని నిందించడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ మండిపడ్డారు. వికారాబాద్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న మోడీని విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేయలేదని అంటున్నారని.. తెలంగాణ సీఎం కేసీఆర్? మోడీనా? అని ప్రశ్నించారు. అన్ని మోడీనే చేస్తే.. ఇక కేసీఆర్ ఎందుకని నిలదీశారు. కేసీఆర్ కుటుంబంలో తప్ప యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మరిన్ని కావాలంటూ ప్రధాని వద్దకు పోదామని కేసీఆర్కు పిలుపునిచ్చారు.
జర్నలిస్టులకు బండి సంజయ్ క్షమాపణలు
కాగా, బండి సంజయ్తో పాలకుర్తి జర్నలిస్టులు వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఆగ్రహంతో బండి సంజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. బండి సంజయ్ ప్రసంగానికి ముందు.. స్థానిక బీజేపీ నేత నెమరుగముల వెంగళరావు మాట్లాడారు. ఆయన ప్రసంగంలో భాగంగా.. పాలకుర్తిలో జర్నలిస్టులకు మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నెమరుగముల వెంగళరావు వ్యాఖ్యల పట్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకుర్తి జర్నలిస్టులు.. అలా ఎలా అంటారంటూ ఆందోళన చేశారు. జర్నలిస్టులకు నచ్చజెప్పేందుకు బండి సంజయ్ ప్రయత్నించగా.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇక చేసేదేమీలేక.. జర్నలిస్టులకు వెంగళరావు తరఫున సంజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. జర్నలిస్టులపై అలా మాట్లాడటం తప్పని అన్నారు. జర్నలిస్టుల తరపున నిలబడే పార్టీ బీజేపీనేనని అన్నారు. జర్నలిస్టుల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాము పోరాడతామని బండి సంజయ్ అన్నారు. కాగా, పాదయాత్రకు ముందు విస్నూర్లో సామూహిక గీతాలాపన కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications