బీజేపీ - పవన్ కల్యాణ్ పొత్తుపై బండి సంజయ్ క్లారిటీ..!!
బీజేపీ - జనసేన మధ్య పొత్తు పై బండి సంజయ్ తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల తరువాత బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమైంది. అప్పటి నుంచి రెండు పార్టీలు పొత్తుతో కొనసాగతున్నాయి. కానీ, రెండు పార్టీలు కలిసి నిర్వహించిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ జనసేన పోటీ చేయకుండా బీజేపీ నేతలు నేరుగా పవన్ వద్దకు వచ్చి చర్చలు చేసారు. ఫలితంగా జనసేన పోటీకి దూరంగా నిలిచింది.

జనేనతో పొత్తు ఉండదన్న బండి
కానీ, తెలంగాణ బీజేపీ నేతల తీరు పైన గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ పార్టీ నేతలకు మర్యాద ఇవ్వని బీజేపీ నేతలతో తమ మైత్రి కొనసాగదని చెబుతూ..ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీలో నిలిచిన దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీకి పవన్ మద్దతు ప్రకటించారు. ఇక, తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడా బీజేపీ - జనసేన మధ్య పొత్తుతోనే ఎన్నికల్లో పోటీ చేసారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ఎక్కడా బీజేపీ కోసం జనసేన పని చేయలేదు. ఇప్పుడు ఏపీలో బీజేపీ - జనసేన మధ్య పొత్తు తెగే వరకు వచ్చిన సమయంలో ప్రధాని ఏపీ పర్యటన మొత్తం సీన్ మార్చేసింది.

పొత్తులు ఏపీ వరకే పరిమితం
బీజేపీ - జనసేన పొత్తు కొనసాగటానికి లైన్ క్లియర్ అయింది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ శైలిని గమనిస్తే, ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉందని వెల్లడించారు. జనసేనతో బీజేపీ పొత్తు ఏపీకే పరిమితమవుతుందని స్పష్టం చేసారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ నేతలు జనసేనతో పాటుగా చంద్రబాబు తోనూ పొత్తుతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

టీడీపీతో కలిసే ఛాన్స్ లేనట్లేనా
సరిగ్గా ఇదే సమయంలో..బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా చంద్రబాబు కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. గ్రేటర్ లో టీడీపీ బరిలో ఉంటే..తమకు విజయావకాశాల మీద ప్రభావం ఉంటుందనేది కొందరు బీజేపీ నేతల భావన. దీంతో, బీజేపీ - జనసేన- టీడీపీ పొత్తు తెలంగాణ - ఏపీలో ఉంటుందంటూ కొన్ని విశ్లేషణలు తెర మీదకు వచ్చాయి. కానీ, ఇప్పుడు బండి సంజయ్ ఇచ్చిన స్పష్టతతో ..పొత్తుల ప్రభావం ఏపీలోనూ ఉండే అవకాశం కనిపిస్తోంది. బండి సంజయ్ వ్యాఖ్యల పైన జనసేన స్పందన చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications