ఫోన్ ట్యాపింగ్ కేసు: కేసీఆర్ విషయంలో సంచలన డిమాండ్లు; సీబీఐ ఎంట్రీపై బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేశారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు ఎమర్జెన్సీకంటే దారుణమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించిన నీచుడు కేసీఆర్ అని, రాధాకిషన్ రావు వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నిషేధం విధించాలి: బండి సంజయ్
ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవి చేపట్టడానికి కూడా అర్హుడు కాదని వెంటనే ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయన ఏ ఎన్నికల్లోనూ పోటీ చెయ్యకుండా నిషేధం విధించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను గతంలో చెప్పిందే నిజమైందన్నారు.

కేసీఆర్ కు బీజేపీ అంటే వణుకు
కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకున్నట్లు అర్ధమవుతోందన్నారు. బీజేపీ సానుభూతిపరులతోపాటు, పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేశారంటే కేసీఆర్ కు బీజేపీ అంటే ఎంతగా వణుకు పుడుతుందో తెలుస్తోందన్నారు బండి సంజయ్ .
ఫోన్ ట్యాపింగ్ తో ప్రాధమిక హక్కులను కాలరాసిన నీచుడు కేసీఆర్
లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సృష్టించినట్లు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ తో తేలిపోయిందన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమేనన్నారు.ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తమకున్న ప్రత్యేకమైన హక్కులను కాపాడటం దేవుడెరుగు, దేశ పౌరుడికి ఉండే కనీస ప్రాథమిక హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాసిన నీచుడు కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చెయ్యాలి
ఫోన్లో భార్యాభర్తల మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేయడం ద్వారా కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు యత్నించిన కిరాతకుడు అని మండిపడ్డారు. కేసీఆర్ తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన కొడుకు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ పాపంలో భాగం పంచుకున్నందున అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును సైతం రద్దు చేసే అంశంపై ఆలోచించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నట్లు తెలిసినా ఎందుకు భారత్ కు రప్పించలేకపోతున్నారు? చెప్పాలని ప్రశ్నించారు బండి సంజయ్ర్. ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే అవకాశముంది కదా? అయినా ఎందుకు ఆ పని చేయడం లేదు? చెప్పాలన్నారు.
ఈ కేసు సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలి
తక్షణమే కేసీఆర్ ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలి. సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. అట్లాగే ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా శాసనసభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పక్షాన కోరుతున్నామన్నారు.












Click it and Unblock the Notifications