బండి సంజయ్ నాల్గవవిడత ప్రజాసంగ్రామ పాదయాత్ర నేటినుండే.. గ్రేటర్ హైదరాబాద్ లక్ష్యంగా సమరభేరి!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర నాలుగో దశ సోమవారం కుత్బుల్లాపూర్లోని రాంలీలా గ్రౌండ్స్ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం పై తన పాదయాత్ర ద్వారా సమరశంఖం పూరించిన బండి సంజయ్ మూడో విడత పాదయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగో విడత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం సాగనున్న పాదయాత్రను బండి సంజయ్ మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలో కొనసాగించనున్నారు. ఇక రేవంత్ రెడ్డి పార్లమెంట్ స్థానంలో బండి సంజయ్ పాదయాత్ర ఎలా సాగనుంది అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.

నేడే నాలుగో విడత బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం.. బహిరంగ సభ
నేడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర ప్రారంభం సందర్భంగా బండి సంజయ్ కుమార్ సోమవారం రాంలీలా గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ముఖ్య అతిథిగా నాలుగో విడత పాదయాత్ర ప్రారంభానికి, నిర్వహించనున్న సభ కు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు చిట్టారమ్మ ఆలయం వద్ద పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ బండి సంజయ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు.

115.3 కిలోమీటర్ల మేర పదిరోజుల పాటు సాగనున్న పాదయాత్ర ..
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. మళ్ళీ నాల్గవ విడతలో 10 రోజుల పాటు జరిగే బండి సంజయ్ పాదయాత్రలో 115.3 కిలోమీటర్ల మేర ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ బహిరంగ సభలో పాల్గొనేందుకు బ్రేక్ తీసుకోనున్న బండి సంజయ్, తెలంగాణ విమోచన దినోత్సవం నాడు జరగనున్న సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు సభలో పాల్గొంటారు.

పాదయాత్ర సాగుతుంది ఇలా
కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్.బి నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు 10 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర ముగింపు రోజు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెద్ద అంబర్పేటలో జాతీయ స్థాయి బిజెపి నాయకులు హాజరయ్యే మరో బహిరంగ సభ ఉంటుంది. వేదిక, నేతల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తాం అని పాదయాత్ర ప్రముఖ్ జి. మనోహర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లో బీజేపీకి మద్దతు యత్నం
బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఇప్పటి వరకు ఆయన 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడం కోసం బండి సంజయ్ కుమార్ పాదయాత్ర సాగిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి కూడా విశేషంగా మద్దతు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

ఈసారి బండి సంజయ్ పాదయాత్ర గ్రేటర్ హైదరాబాద్ లో.. టార్గెట్ ఇదే!!
ఇక ఈసారి బండి సంజయ్ పాదయాత్ర గ్రేటర్ హైదరాబాద్లోని సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా సాగనుంది. గ్రేటర్ హైదరాబాద్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు , రాజీవ్ స్వగృహ ఇళ్ళు, స్థానిక సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్లు, చెరువుల కబ్జాలు, కాలుష్యం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచడానికి బండి సంజయ్ రంగంలోకి దిగనున్నారు. అయితే గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడవ విడత పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని, అయినా తాము సక్సెస్ అయ్యాము అని చెబుతున్న బీజేపీ నేతలు, నాలుగో విడత పాదయాత్రను భగ్నం చేయడానికి కూడా టిఆర్ఎస్ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని, అయినప్పటికీ పాదయాత్రను కొనసాగించి తీరుతామని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications