సీఎం కేసీఆర్ కు ఈడీవిచారణ తప్పదు; అందుకే కాంగ్రెస్ తో దోస్తానా: బండి సంజయ్ సంచలనం
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ బాంబు పేల్చారు. త్వరలో ఆయన ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలది చీకటి బంధం అంటూ ఆరోపించారు.

ప్రజల బాధలు పోవాలంటే బీజేపీ రావాలి: బండి సంజయ్
ప్రజా గోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పడం కోసమే బిజెపి బైక్ ర్యాలీలు నిర్వహిస్తుందని పేర్కొన్న బండి సంజయ్ ప్రజల బాధలు పోవాలంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని, బిజెపి అధికారంలోకి రావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ఉద్యోగులకు సరిగ్గా జీతాలు రావాలన్నా అది బీజేపీ తోనే సాధ్యమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

దేశ్ కీ నేత .. అంటూ కేసీఆర్ పై సెటైర్లు వేసిన బండి సంజయ్
ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ కుటుంబ పాలన పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. దేశ్ కి నేత .. దిన్ భర్ పీతా .. ఫాం హౌజ్ మే సోతా .. అమావాస్యకి పున్నానికి ఆతా అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేసి సెటైర్లు వేశారు బండి సంజయ్. తెలంగాణ కల్వకుంట్ల జాగీరా అని ప్రశ్నించిన ఆయన కుటుంబ పాలనతో కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అడుగడుగున అవమానించిన అల్లుడికి సిగ్గు లేదని, నోటి నిండా అబద్ధాలే వల్లిస్తున్నాడు అంటూ హరీష్ రావు పై మండిపడ్డారు బండి సంజయ్.

నదులకు నడక నేర్పిన కెసిఆర్ నీళ్లలో మునిగిన మోటార్లకు ఈత నేర్పలేదా
ఇక నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొల్లగొట్టిన వారికి మద్దతుగా కేసీఆర్ ఆందోళనలు చేస్తున్నారని, ఇది సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ కు ఈడీ విచారణ తప్పదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలతో కేసీఆర్ అంతర్జాతీయ జోకర్ గా మారారని బండి సంజయ్ విమర్శించారు.
30 వేల కోట్ల ప్రాజెక్టులను, లక్షా 30 వేల కోట్ల రూపాయలకు పెంచి ప్రజల సొమ్మును దోచేసిన ఘనుడు కెసిఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు. నదులకు నడక నేర్పిన కెసిఆర్ నీళ్లలో మునిగిన మోటార్లకు ఈత నేర్పలేదా అంటూ ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో ఉండి పాలన చేసే సీఎం ఉండడం తెలంగాణ రాష్ట్ర దౌర్భాగ్యం అంటూ బండి సంజయ్ తిట్టిపోశారు.

కేసీఆర్ కు విచారణ తప్పదు... అందుకే కాంగ్రెస్ తో కలవక తప్పదు
రైతుబంధు మాత్రమే ఇచ్చారని దళిత బంధు సహా అన్నింటినీ ఆపి వేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక పంటలకు మద్దతు ధర పెంచిన ఘనత బిజెపి ప్రభుత్వానిది అని పేర్కొన్న బండి సంజయ్, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి సమాధానం చెప్పిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పై సిబిఐ విచారణ జరుగుతుందని, ఈ నేపథ్యంలో సపోర్టు కోసం కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదని బండి సంజయ్ బాంబు పేల్చారు. భవిష్యత్తులో ఇద్దరం కలిసి కొట్లాడదామని టీఆర్ఎస్ పార్టీకి సంకేతాలు ఇవ్వడం కోసం తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుందంటూ బండి సంజయ్ ఆరోపించారు.

శ్రీలంక లో ఉన్న పరిస్థితులే ప్రస్తుతం తెలంగాణాలోనూ
ప్రజాస్వామిక తెలంగాణ సాధించటం బిజెపి లక్ష్యమని పేర్కొన్నారు బండి సంజయ్, శ్రీలంకలో ఉన్న పరిస్థితులే రాష్ట్రంలో ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అంటూ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను, బస్సు చార్జీలను, పెట్రోల్ చార్జీలను విపరీతంగా పెంచి దోచుకుంటున్న కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications