కేసీఆర్ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలంటూ బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ సర్కారు పేద ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు కోసం గంటలో 34 కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేసిందని సంజయ్ ఆరోపించారు. మహిళలకు ఆపరేషన్ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
కేసీఆర్ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలంటూ బండి సంజయ్
అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసే ముందు కనీసం ప్రాథమిక పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు. మృతుల కుటుంబాలను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఎందుకు పరామర్శించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.కు.ని చికిత్సలతో నలుగురు మహిళల మృతికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సీఎం వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలన్నారు.
అబద్ధాల మంత్రి హరీశ్ రావు అంటూ బండి సంజయ్
మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించకుండా బీహార్ పర్యటనకు వెళ్లారని.. కేసీఆర్కి రాజకీయాలు తప్ప పేదల బాధలు పట్టవని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ 8 ఏళ్లలో కేసీఆర్ ఒక్క పేద కుటుంబాన్ని అయినా పరామర్శించారా? మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అబద్ధాల మంత్రిగా మారిపోయారని విమర్శించారు. కు.ని. చికిత్సలతో మృతి చెందిన మహిళల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Recommended Video
పేదలను పరామర్శించే తీరిక లేదా? బండి సంజయ్
ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కరు కూడా ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించలేదని బండి సంజయ్ అన్నారు. భూమి కబ్జాలు, ఇసుక ,లిక్కర్, క్యాసినో ఆడుకుంటూ బిజీగా ఉన్నారా? అంటూ ధ్వజమెత్తారు. పేదలను పరామర్శించకుండా ఉండేంత బిజీ అంత ఏముందని ప్రశ్నించారు. కాగా, జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చేరుకున్న బండి సంజయ్... మహిళల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, వెంకటేశ్వర్లు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి సహా పలువురు బీజేపీ నేతలు అపోలో ఆస్పత్రికి వెళ్లారు.