కేసీఆర్ 8 ఏళ్ల పాలన రైతులకు కన్నీరు.. ఫాంహౌస్ పంట పన్నీరు: బండి సంజయ్ విమర్శలు
హైదరాబాద్: ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో పేదలు, రైతులు, సామాన్యులకు ఒరిగిందేమీ లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనంతా రైతుల కంట కన్నీరు.. ఆయన ఫాంహౌస్ పంట పన్నీరుగా మారిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
7500 రైతు బంధు నిధులు జమ చేయండి: బండి సంజయ్
వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచినందుకు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. '7500 కోట్లు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్.
కేసీఆర్, కేటీఆర్ పర్యటనలకే కోట్ల ఖర్చంటూ బండి ఫైర్
రైతుబంధు నిధులు రూ. 7500 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి. సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలకు ప్రభుత్వ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మరి రైతుబంధుకు, రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమని లేఖలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రైతుబంధు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవుతున్నారు.
కేసీఆర్ సర్కారు బకాయిలు చెల్లించాలన్న బండి సంజయ్
కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణలో రూ. 5800 కోట్ల నిధులను జమ చేసి రైతులను ఆదుకుంది. ఈ పథకంలో భాగంగా ఈ సీజన్ కోసం రూ. 580 కోట్లను మే 31న కేంద్రం విడుదల చేసింది. పసల్ బీమా యోజన పథకం ద్వారా నష్టపోయిన రైతులకు చేయూతనిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాల రైతులకు అందేలా చేయాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ తన లేఖలో డిమాండ్ చేశారు.