రబ్బర్ స్టాంప్ పాలన! ఆ 3 పార్టీలపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టించిందని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కు లేకుండా పోయిందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాప్లా మారిపోయారని.. రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీ భవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

ముఖ్యమంత్రి అధికారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ హస్తగతం చేసుకోవడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారని ఆరోపించారు. పాలనపై సీఎంకు పట్టులేదనడానికి హెచ్సీయూ భూముల వ్యవహారమే ఉదాహరణ అని అన్నారు. కాంగ్రెస్ పాలన అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మజ్లిస్ పార్టీకి ఓటేయాలని చూస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ను మజ్లిస్కు అప్పగించేందుకు ఈ రెండు పార్టీలు పోటీపడుతున్నాయన్నారు. మజ్లిస్ దేశద్రోహ పార్టీ అని.. బీజేపీ దేశభక్తి పార్టీ అని అన్నారు. ఈ ఎన్నికలు దేశద్రోహ పార్టీకి, దేశ భక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా బండి సంజయ్ అభివర్ణించారు.
హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఎవరి పక్షాన నివాలో ఆలోచించాలని బండి సంజయ్ సూచించారు. బీజేపీ అభ్యర్థి గౌతంరావు గెలుస్తారనే నమ్మకం ఉందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం ఆర్థిక ప్రగతిలో అద్భుత ఫలితాలు సాధించిందని, కేంద్ర సంక్షేమ పథకాలను తెలంగాణలో పూర్తిగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టిలో చూస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోడీదేనని అన్నారు.
రేషన్ షాపుల్లో ప్రజలకు అందిస్తున్న బియ్యం మోడీ బియ్యమేనని తెలిపారు. కిలో బియ్యం కోసం కేంద్రం రూ. 37 ఖర్చు చేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సన్న బియ్యం పేరిట కేవలం రూ. 10 ఖర్చు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు నుంచి బియ్యం పంపిణీ వరకు ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందని బండి సంజయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications