పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరెస్ట్, మీడియాపై కేసులు పెట్టే యోచనలో జనసేనాని?
హైదరాబాద్: మీడియా చానెళ్లపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఆయనకు మద్దతుగా శుక్రవారం పెద్ద ఎత్తున అభిమానులు ఫిలిం చాంబర్ వద్దకు తరలివచ్చిన సంగతి తెలిసిందే.
మీడియా జోలికి రావద్దు, ఆ విషయం గుర్తుంచుకుంటే మంచిది: పవన్కి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన
ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఓబీ వ్యాన్, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని మీడియా వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్లతో దాడికి దిగారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జర్నలిస్టు సంఘాలు దాడిని ఖండిస్తూ పవన్ కు హెచ్చరికలు జారీ చేశాయి.
ఏబీఎన్ వాహనాలపై దాడికి పాల్పడ్డ పవన్ అభిమానులను తాజాగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భానుప్రసాద్ (ఉప్పల్) సాయి కిరణ్రెడ్డి (రామంతపూర్), హరికృష్ణారెడ్డి (చైతన్యపురి), అంబటి గోపి ఫణీంద్ర (కూకట్పల్లి), కంటిపూడి రామకృష్ణ (కూకట్పల్లి) ఉన్నట్టు సమాచారం.
కాగా, పవన్ ఆయన అభిమానుల వైఖరిని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నేడు జర్నలిస్టులంతా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసనకు దిగారు.
కేసులు పెట్టే యోచనలో పవన్:
మీడియా అధినేతలు పవన్ కల్యాణ్ పై పరువు నష్టం దావాకు దిగుతున్న నేపథ్యంలో.. ఆయన కూడా చట్టపరంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా చానెళ్లపై ఆయన కేసులు పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేసులు పెట్టడమా?.. లేక పరువు నష్టం దావా వేయడమా? అన్న దానిపై ఆయన రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.