చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా ఒప్పుకోం: కాపు రిజర్వేషన్లపై కృష్ణయ్య హెచ్చరిక
హైదరాబాద్: ఏపీలో కాపులను బీసీల జాబితాలో చేర్చే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విరమించుకోవాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం మహబూబ్నగర్లో నిర్వహించిన బీసీ గర్జన సదస్సులో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా కాపులను బీసీ ల్లో చేర్చనివ్వబోమని అన్నారు. చిన్న చిన్న కులాలను బీసీ జాబితాలో చేరిస్తే స్వాగతిస్తామని, కానీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబోమన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలని, కాపులను బీసీలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. తాను మాత్రం బాబు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తీరుతారని, తాను బీసీ జాతి కోసమే పనిచేస్తున్నానని అన్నారు.
తాను తెలుగుదేశం పార్టీ జెండా మోసే వ్యక్తిని కాదని, ఎప్పుడు కూడా జెండా మోయలేదని తన ఎజెండా బీసీ జాతికే ప్రాధాన్యత అని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులకు బీసీ జాతి అంటే ధర్మసత్రంలా అనిపిస్తోందని, అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందుగా చంద్రబాబు కాపుల జనాభా లెక్కలతో పాటు వారి స్థితిగతులపై అధ్యయనం చేయాలని, కాపుల ఆర్థిక పరిస్థితులు ఏంటో ఓసారి తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల్లో కాపులు అభివృద్ధి చెందిన వారిలో ముందు వరుసలో ఉన్నారని ఆయన అన్నారు.
పేదరిక నిర్మూలన పథకం బీసీ జాబితా కాదని, అలా నాయకులు అనుకుంటే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా కాపులను బీసీ జాబితాలో చేరిస్తే రాజకీయంగా మిగతా కులాలు కనుమరుగు కావడం ఖాయమని ఆయన అన్నారు. దేశంలో బీసీ జాబితాలో చేర్చాలని ఎన్నో కులాలవారు ఎందరో పోరాటాలు చేస్తున్నారన్నారు.
రాజస్థాన్లో గుజ్జర్లు, గుజరాత్లో పటేల్ కులానికి చెందిన వారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాల పేరిట ఆందోళన చేస్తే రాజకీయ పార్టీలు వారికి వత్తాసు పలకలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాపుల రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని చెప్పారు. సామాజికంగా కాపులు ఇప్పటికే ఉన్నత స్థానంలో ఉన్నారని తెలిపారు.
చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు బీసీ వర్గాల అభివృద్ధికై 17 అంశాలను పొందుపరిచారని రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పారని, ముందుగా వాటిపై దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే పదవి తనకు గడ్డిపోచతో సమానమని, అవసరమైతే దాన్ని కూడా వదులుకొని బీసీలకు న్యాయం చేసేందుకు పోరాటం చేస్తానని కృష్ణయ్య ప్రకటించారు.












Click it and Unblock the Notifications