వారం క్రితమే 'తండ్రి'పై కంటతడిపెట్టిస్తున్న అమృత పోస్ట్, బీ కేర్ఫుల్.. ముందే పోలీసుల హెచ్చరిక
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతిరావు గతంలో ఓ హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తోంది. ప్రణయ్ - అమృతల రిసెప్షన్ గత నెలలో జరిగింది. ఆ సమయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నారు. దీనిని వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. దీనిని చాలామంది చూశారు.
చదవండి: నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్పై గతంలోను...
ముందే హెచ్చరించిన తండ్రి
నీ పెళ్లి లేదా ప్రీ వెడ్డింగ్ వీడియో కంటే ప్రణయ్ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయని ప్రత్యేక ప్రీ వెడ్డింగ్ వీడియోను తన ఫేస్బుక్ ఖాతాలో అమృత అప్లోడ్ చేసిన తర్వాత తండ్రి మారుతీరావు హెచ్చరించాడని తెలుస్తోంది. మూడు వారాల కిందట ఫేస్బుక్లో అమృత ఈ వీడియోను పోస్ట్ చేసింది. దానిని చాలామంది చూశారు. శుక్రవారం ఆసుపత్రి ముందు ప్రణయ్పై కత్తితో దాడి చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ క్లిప్పింగ్స్ను టీవీ ఛానల్స్ కవర్ చేశాయి. వీటిని కూడా లక్షలాది మంది చూశారు.
పెళ్లి చేసుకున్నారు
ఇదిలా ఉండగా, ప్రణయ్-అమృతలు నాలుగైదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తొమ్మిదో తరగతిలోనే ప్రణయ్తో ప్రేమలో పడిన అమృత, ఆపై కాలేజీ చదువుతున్న రోజుల్లో మరింతగా ఇష్టపడింది. ఆ సమయంలోనే రహస్యంగా వారు పెళ్లి చేసుకుని, దీని గురించి బయటకు తెలిస్తే గొడవలు అవుతాయనే భయంతో దాచిపెట్టారని తెలుస్తోంది. ఇటీవల జనవరిలో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు.
వెడ్డింగ్ రిసెప్షన్కు పోలీసులను ఆహ్వానించినప్పుడే హెచ్చరిక
గత నెల ప్రణయ్ - అమృతలు వెడ్డింగ్ రిసెప్షన్ చేసుకున్నారు. అప్పుడే పోలీసులు వారిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారని తెలుస్తోంది. వెడ్డింగ్ రిసెప్షన్కు ఆహ్వానించేందుకు వారు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడు పోలీసులు.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.
కంటతడిపెట్టిస్తున్న అమృత పెట్టిన ఫేస్బుక్ పోస్ట్
అమృత కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 'ప్రతి ఒక్కరు తల్లి ప్రేమ గురించి మాట్లాడుతుంటారని, కానీ ఏ ఒక్కరు తండ్రి త్యాగం గురించి మాట్లాడరు' అని ఓ పోస్ట్ పెట్టారు. దీని కింద ఒకరు.. నీకు అతనే అన్యాయం చేశాడు.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండవని ఒకరు కామెంట్ పెట్టారు.