కేసీఆర్ పుట్టక ముందే నగరం గంగా-జమున తహజీబ్గా పేరుగాంచింది.!సెక్యులర్ సీఎంగా విర్రవీగొద్దన్న షబ్బీర్ అలీ.!
హైదరాబాద్ : ఇఫ్తార్ విందు సందర్బంగా మైనారిటీ యువతకు రుణాలు, ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని తెలంగాణ శాసనమండలి మాజీ మంత్రి, మాజీ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాత్రి ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చిన విషయంపై షబ్బీర్ అలీ స్పందించారు.
గత ఎనిమిదేళ్లలో 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, మైనారిటీ యువతకు ఉద్యోగాలు, రుణాలు, గృహ సదుపాయం, ఫీజు రీయింబర్స్మెంట్, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ల విడుదల, ఇతర ఎన్నికల హామీలపై సీఎం చంద్రశేఖర్ రావు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు షబ్బీర్ అలీ.మైనారిటీ సంబంధిత కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే గడువును పేర్కొనలేదని ఇఫ్తార్ సమయం ముస్లింలకు పవిత్రమైన ఘట్టమని, తప్పుడు ప్రకటనలు చేసి మైనారిటీల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు దాన్ని ఉపయోగించుకున్నారని షబ్బీర్ అన్నారు.చంద్రశేఖర్ రావు తన హామీలను నిలబెట్టుకుంటారనే ఆశతో మైనార్టీలు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారని, గతంలో చంద్రశేఖర్ రావు బూటకపు వాగ్దానాలు, తప్పుడు వాదనలతో ముస్లింలను మోసం చేశారని అన్నారు.
హైదరాబాద్ 400 సంవత్సరాలకు పైగా శాంతియుత నగరంగా ఉందని అన్నారు. చంద్రశేఖర్ రావు పుట్టక ముందే హైదరాబాద్ గంగా-జమునీ తహజీబ్కు పేరుగాంచిందని, కొన్ని మతపరమైన అల్లర్లు మినహా హైదరాబాద్ చరిత్ర మతతత్వపు మూర్ఖత్వాలకు దూరంగా ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్ను పాలించిన 16 మంది ముఖ్యమంత్రులు ఇఫ్తార్ విందు ఇచ్చారని, తానే సెక్యులర్ సీఎం అని చంద్రశేఖర్ రావు విర్రవీగాల్సిన అవసరం లేదన్నారు షబ్బీర్ అలీ.