వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతం
Recommended Video
తెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్టూ తిరుగుతున్నారు.దీంతో విఆర్వోలు లంచం ఇస్తేనే పని జరుగుతుందంటూ తెగేసి చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపూర్లో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. వీఆర్వోల అవినీతి బాగోతం మరోమారు బయటకు వచ్చింది.
రెవిన్యూ శాఖలో వేళ్ళూనుకున్న అవినీతి... రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల లంచావతారం
రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల నవీనీకరణ చేయడంతో పాటుగా, భూములకు సంబంధించిన పట్టాలు, పాసు పుస్తకాలు రైతులకు ఇస్తున్న రెవిన్యూ శాఖలో అవినీతి వేళ్లూనుకుంది. ఒకపక్క రైతాంగానికి అండగా ఉండాలని సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తూ రైతుల సంక్షేమం కోసం పని చేస్తుంటే, రైతాంగానికి తమ వంతు సహకారం అందించాల్సిన రెవెన్యూ శాఖలో పని జరగాలంటే మాత్రం చెయ్యి తడవాల్సిందే అన్న చందంగా తయారయింది పరిస్థితి. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పైసలు ఇస్తేగానీ పట్టాలు ఇవ్వమంటూ వీఆర్వోలు ఇబ్బంది పెడుతున్నారు .లంచాలిచ్చే స్తోమత లేని రైతన్నలు లబోదిబోమంటున్నారు. కానీ డబ్బులిస్తే గానీ పట్టాలివ్వమని వీఆర్వోలు తెగేసి చెప్పారు.
మొన్న భూపాలపల్లిలో తహసీల్దారుకు లంచం ఇయ్యాలని బిక్షాటన చేసిన వృద్ధ దంపతులు
ఇటీవల తహసీల్దారుకు లంచం ఇచ్చేందుకు సాయం చేయాలంటూ ఇద్దరు వృద్ధ దంపతులు బిచ్చమెత్తిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం ఆజంనగర్కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. లంచం డబ్బులు ఇచ్చే స్తోమత లేని రైతు దంపతులు భిక్షాటన విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించి ఆర్డీవో ద్వారా సమస్య పరిష్కరించారు.లంచం అడిగిన తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
భూపాలపల్లి ఘటన మరువకముందే .. మరోమారు వీఆర్వోల లంచం కోసం రైతుల బిక్షాటన
భూపాలపల్లి ఘటన మరువకముందే వీఆర్వోలకు లంచమివ్వాలి.. బిచ్చమెయ్యండి అంటూ ఫ్లకార్డులు పట్టుకుని వీధి వీధి తిరుగుతూ బిచ్చమెత్తారు ములుగు జిల్లా వెంకటాపూర్లో రైతులు. వెంకటాపూర్కు చెందిన కనుకుంట్ల రాజయ్య, బొమ్మెడ చిన్నసాంబయ్య, అనుముల దేవేందర్, మామిడి నర్సయ్యతోపాటు లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన డి. కృష్ణమూర్తి భిక్షాటన గురించి తెలిసిన తహసీల్దార్ దేవాసింగ్.. వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. పొలాల వద్దకు తీసుకెళ్లి వీఆర్వో, సర్వేయర్తో పరిశీలన చేయించారు. త్వరలో నే వారికి పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారు. వీఆర్వోలు, వీఆర్ఏలపై విచారణ జరిపిస్తామని తహసీల్దార్ తెలిపారు.