టీఆర్ఎస్కు ఎదురు తిరుగుతోన్న హైదరాబాదీయులు: ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ: తోసేశారు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూసిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలకు హైదరాబాదీయులు ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పట్ల తమకు ఉన్న విముఖతను ఓటు రూపంలో స్పష్టం చేసిన హైదరాబాద్ ప్రజలు.. ప్రత్యక్షంగా వారిని నిలదీసే పరిస్థితి ఏర్పడింది. భారత్ బంద్లో పాల్గొన్న ఆ పార్టీ నేతలకు జనం ఎదురు తిరుగుతుండటం దీనికి ఉదాహరణ చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.
బంద్లో విస్తృతంగా టీఆర్ఎస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తోన్నవిషయం తెలిసిందే. బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ బంద్కు మద్దతు తెలిపాయి. సంఘీభావాన్ని ప్రకటించాయి. టీఆర్ఎస్ కూాడా బంద్కు మద్దతు ఇచ్చింది. ఇందులో భాగంగా- ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బంద్లో విస్తృతంగా పాల్గొన్నారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ట్రాఫిక్ను అడ్డుకున్న అరికెపూడి గాంధీ
భారత్ బంద్లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీలో శేరిలింగంపల్లికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆయన తన నియోజకవర్గంలో బంద్లో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. బ్యానర్లను పట్టుకుని వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి నిరసనగా నినాదాలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి బీజేపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు.
నిలదీసిన వాహనదారులు..
వాహనాల రాకపోకలను అడ్డుకుంటోన్న అరికెపూడి గాంధీని కొందరు వాహనదారులు నిలదీశారు. ఓ మహిళ అరికెపూడి గాంధీని ప్రశ్నించారు. కొన్ని గంటలపాటు తాము ట్రాఫిక్లో చిక్కుకునిపోయామని, ఎటూ కదల్లేకపోతున్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే భారత్ బంద్ ఉంటుందని ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అలాంటప్పుడు.. నిర్దేశిత సమయం కంటే ముందే ఎందుకు వాహనాలను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. బంద్ చేయడం వల్ల తమకు సంతోషమే గానీ.. కూర్చుని తింటున్నారని ఆరోపించడం సరికాదని చెప్పారు.
బంద్ గురించి ప్రశ్నించిన మరొకరిని తోసేసిన ఎమ్మెల్యే..
అదే సమయంలో బంద్ ఎందుకు చేస్తున్నారని, వాహనాల రాకపోకలను స్తంభింపజేస్తున్నారని ప్రశ్నించిన మరొకరిని అరికెపూడి గాంధీ వెనక్కి నెట్టేశారు. అతను ఏదో చెప్పబోతుండగా వినిపించుకోలేదు. భుజంపై చెయ్యి వేసి వెనక్కి తోశారు. అక్కడే ఉన్న అరికెపూడి అనుచరులు.. ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. బలంగా తోసివేశారు. పోలీసులు వారించినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. తమ నాయకుడినే ప్రశ్నించడానికి నువ్వెవడివంటూ దౌర్జన్యం చేశారు.
మెట్రో రైల్ రాకపోకలనూ అడ్డుకున్న టీఆర్ఎస్..
బంద్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మెట్రో రైళ్లను కూడా అడ్డుకున్నారు. మెట్రో స్టేషన్లకు వెళ్లిన వారంతా గుంపుగా పట్టాలపై బైఠాయించారు. నినాదాలు చేశారు. వారిని తరలించడానికి సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో సుమారు అరగంటకు పైగా మెట్రో రైల్ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. బంద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేస్తామని అన్నారు.