మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి: భట్టి విక్రమార్క భేటీ తర్వాత ఏమన్నారంటే.?
హైదరాబాద్:మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో అవసరమైన సమయంలో పాల్గొంటానని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో గురువారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
కోమటిరెడ్డితో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిపై చర్చ
కోమటిరెడ్డి నివాసంలో దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై వెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అభ్యర్థి ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని ఆయనకు వివరించారు. అభ్యర్థి ఎంపికలో పార్టీ నిర్ణయానికి వెంకట్ రెడ్డి సహకరిస్తారని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.
మునుగోడు అభ్యర్థి ఎవరైనా ఓకేనంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మరోవైపు, భట్టి విక్రమార్కతో భేటీపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మునుగోడు అభ్యర్థి ఎంపికపై భట్టి తనతో చర్చించారని తెలిపారు. అభ్యర్థి ఎంపికపై నిన్న, ఇవాళ పార్టీలో జరిగిన కరసత్తుపై వివరించారన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదన్నారు వెంకట్ రెడ్డి. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మునుగోడు ప్రచారానికి వెళ్తానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సర్వేల ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తాను అవసరమైన సమయంలో వెళ్తానని స్పష్టం చేశారు. ఇది ఇలావుండగా, మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధిష్ఠానం నిర్ణయించింది. గాంధీభవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో మునుగోడు అభ్యర్థి ఎంపికపై బుధవారం సమావేశమయ్యారు. ముఖ్య నేతలంతా గురువారం కూడా కీలక చర్చలు జరిపారు.