తెలంగాణా వాసులకు బిగ్ అలర్ట్.. రైతులూ జర జాగ్రత్త!!
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. వాతావరణ శాఖ మళ్ళీ రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడి,అది ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.రాష్ట్రానికి మోచా తుఫాను ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు హెచ్చరించింది.

దీంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తనం తోపాటు ,ద్రోణి ప్రభావంతో మోచా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి.
పగటి పూట కాస్త ఎండ ప్రభావం ఉంటుందని, సాయంత్రం రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.మోచా తుఫాను కారణంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
నేడు మరియు రేపు రాష్ట్రం లోని పలు జిల్లాలలో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు హైదరాబాదులో కూడా సాయంత్రం, రాత్రి వేళల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.ఇక అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
వర్షం సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లొద్దని పిడుగులు పడే అవకాశం ఉంటుందని, వాతావరణాన్ని గమనించుకుంటూ పని చేసుకోవాలని సూచిస్తున్నారు.ముఖ్యంగా రైతులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని,ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications