హైదరాబాదీల టేస్టులో మార్పు- సర్వేలో తేలిందిదే : బిర్యానీ..సమోసా వదల్లేం : కీటో డైట్- వేగాన్ రుచులు..!!
కరోనా ఎఫెక్ట్ ఒక్క సారిగా ఆహార రుచులనూ మార్చేసింది. రుచుల కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు పూర్తిగా ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్నే ఎంచుకుంటున్నారు. ప్రతీ ఏటా ప్రకటించినట్లుగా స్విగ్గీ 'స్టాట్ఈటస్టిక్స్-2021'ను విడుదల చేసింది. ఏడాది కాలంలో తమకొచ్చిన ఆర్డర్ల ఆధారంగా విశ్లేషణ చేసింది. పిండి పదార్థాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కీటో డైట్ ఆర్డర్లు 23 శాతం, మొక్కల నుంచి వచ్చే ఆహారం వేగాన్ రుచులు 83 శాతం పెరిగినట్లు తెలిపింది.

మారుతున్న రుచులు
ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుండటంతో ఇంటికి తెప్పించుకునే ఆహారం విషయంలో ప్రాధాన్యాలు మారుతున్నాయి. రోజూ కాకపోయినా రెండురోజులు అందుకోసం కేటాయిస్తున్నారు. ప్రత్యేకించి సోమవారం, గురువారం ఆరోగ్యకర తిండినే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఈ విషయంలో బెంగళూరు నగరం ముందుండగా.. ఆ తర్వాత హైదరాబాద్ నిల్చింది. ఇక ఈ సర్వేలో అంశాల వారీగా దేశ వ్యాప్తంగా ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, నగరాల వారీగా టాప్-5 ఆర్డర్ల వివరాలను స్విగ్గీ విశ్లేషించింది. హైదరాబాదీలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. చికెన్ తినేందుకు అమితాసక్తి చూపుతున్నారు.

రుచులనందు బిర్యానీ టేస్టే వేరుకదా
నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బిర్యానీకి ఎప్పటిలానే సిటీజనులు జై కొడుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్లలో చికెన్ బిర్యానీ మొదటి స్థానంలో ఉండగా, చికెన్ 65 రెండో స్థానంలో నిలిచింది. పనీర్ బటర్ మసాలకు మూడో స్థానం దక్కింది. అల్పాహారంగా మసాల దోసె, ఇడ్లీ తినేందుకు ఇష్ట పడుతున్నట్లుగా సర్వేలో తేలింది. చెన్నై, లక్నో, కోల్కతాల్లోనూ చికెన్ బిర్యానీకే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నట్లు విశ్లేషించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 తరహాలోనే ఈ యేడాదిలోనూ మాస్క్లు, శానిటైజర్లు, హ్యాండ్వాష్ బాటిళ్ల ఆర్డర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంది.

నిమిషానికి 115 బిర్యానీ ఆర్డర్లు
ప్రతి సంవత్సరం బిర్యానీ మొదటి స్థానంలో నిలుస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి నిమిషానికి దేశంలో 115 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి. వరుసగా ఆరో ఏడాది కూడా బిర్యానీ తొలి స్థానంలోనే కొనసాగింది. ఇక, అనేక రకాలుగా చిరుతిళ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ.. ఇప్పటికే ఎక్కువ మంది సమోసానే ఇష్టపడుతున్నారని సర్వేలో స్పష్టం అయింది. ఏడాదికాలంలో స్విగ్గీలో 50 లక్షల ఆర్డర్లు సమోసావే. పావ్బాజీ 21 లక్షలతో రెండో స్థానంలో నిల్చిందని సంస్థ వెల్లడించింది. ఇక, మిఠాయిల్లో గులాబ్జామ్ 21 లక్షలతో మొదటి 12.7 లక్షలతో రస్మలైయ్ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది.

హైదరాబాదీయులు తొలి మూడు టేస్టీ ఫుడ్స్
హైదరాబాదీయులు ఎక్కువగా చికెన్ బిర్యానీ, చికెన్ 65, పనీర్ బటర్ మసాలా, మసాలా దోశ, ఇడ్లీ ఆర్డర్ చేశారని సర్వేలో తేలింది. ఓ వ్యక్తి నాలుకను శుభ్రం చేసుకునే టంగ్ క్లీనర్ను ఇంటికి సమీపంలోని 200 మీటర్ల దూరంలోని స్టోర్ నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేశారని సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే విధంగా.. 2.8కోట్లు ప్యాకెట్ల పండ్లు, కూరగాయలు డెలివరీ చేసినట్లు సంస్థ వెల్లడించింది. కానీ, కరోనా ముందు తమకు వచ్చిన ఆర్డర్లు..ఇప్పుడు వస్తున్న ఆర్డర్ల విషయంలో మాత్రం మార్పు కనిపిస్తోందని పేర్కొంది. కాగా, రెడీ టూ ఈట్ అయిటమ్స్ కేటగిరీలోనూ ఆరోగ్య కరమైన వాటికే ప్రాధాన్యత కనిపిస్తోందని సంస్థ విశ్లేషించింది.












Click it and Unblock the Notifications