ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్: తెలంగాణ కళాకారులకు ఘోర అవమానం
హైదరాబాద్: అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆతిథ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులకు ఘోర అవమానం జరిగింది. చిల్ట్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించే అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిత్రోత్సవానికి తెలంగాణ పదిజిల్లాల విద్యార్థులూ వచ్చారు. వారందరికీ.. జ్యురీ సభ్యులు, విదేశీ అతిథులకు వసతి కల్పించిన పార్క్ హోటల్లోనే వసతి ఏర్పాటుచేశారు. అయితే.. 27గదుల్లో నలుగురైదుగురు వంతున 80 మందికి వసతి కల్పించారు. అయితే, ప్రారంభ వేడుకలకు వెళ్లివచ్చే సరికి తమ గదుల్లో వేరే వాళ్లుండటంతో వారు దిగ్ర్భాంతికి గురయ్యారు.
అంతేగాక, వారి లగేజీనీ మాయంచేశారు. తాళాలు తమ దగ్గర ఉన్నా గదులు వేరేవారి పరంకావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కంగుతిన్నారు. కో-ఆర్డినేటర్లను సంప్రదిస్తే.. ‘పై వారు చెప్పారు.. మేం చేశాం. మీరు హోటల్ ఖాళీచేయాల్సిందే'నని చెప్పడంతో బిత్తరపోయారు. ‘రాత్రి 11.30 గంటలకు ఖాళీ చేయాలంటే పిల్లలతో ఎక్కడికి వెళతాం? హోటల్ సిబ్బందికైనా ఇంగితం లేదా? అయినా మారు తాళాలతో మా గదుల్లో ప్రవేశించి సామగ్రి తీసేసే అధికారం ఎవరిచ్చారని ఉపాధ్యాయులు ప్రశ్నించారు.
‘జ్యూరీ సభ్యులు, ఫారిన్ డెలిగేట్లు వస్తున్నారు. అందరికీ పార్క్ హోటల్లోనే వసతి. కానీ మా దగ్గర రూమ్లు లేవు. ఏం చేయమంటారని అధికారులను ప్రశ్నిస్తే తెలంగాణ విద్యార్థుల రూమ్లు ఖాళీ చేయించాలని చెప్పారు. రూమ్ నంబర్లు కూడా వారే చెప్పారు. అతిథులు వేచి చూడటం కష్టం కాబట్టి డూప్లికేట్ తాళంచెవులతో రూములు తెరిచి, సామగ్రిని బయటపెట్టేయమన్నారు. తీరా గొడవయ్యే సరికి మొహం చాటేశారు. పేర్లు వెల్లడించలేం. ఇది ప్రభుత్వంతో వ్యవహారం' అని అధికారి వాపోయారు.
కాగా, అర్ధరాత్రి పూట విద్యార్థులు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కున హోటల్ లాబీలో గడిపారు. చివరకు తెలంగాణ జిల్లాల డెలిగేట్ కో-ఆర్డినేటర్ చొరవ తీసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాత్రి 2గంటల తర్వాత బేగంపేట టూరిజం ప్లాజాకు తరలించారు.
కాగా, ఎలాంటి సమాచారం లేకుండా సామాన్లు, బ్యాగులు బయట వేయడం పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో ఇంత అవమానం జరగడం భరించలేకుండా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.