గోల్కొండ కోట వద్ద ఉద్రిక్తం: బిజెపి నేతల అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. జాతీయ జెండాను ఎగురవేయడానికి గోల్కొండ కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి బిజెపి నేతలను, కార్యకర్తలను పోలీసులు బుధవారం ఉదయం ఆరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వారు గోల్కొండ కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
వారికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గోల్కొండ కోట వద్ద ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. దాదాపు 300 మందిని అక్కడ మోహరించింది. ఎట్టి పరిస్థితిలోనూ జాతీయ జెండాను ఎగురవేస్తామని బిజెపి నాయకులు ప్రకటించడంతో గోల్కొండ కోట వద్దనే కాకుండా బాపూ ఘాట్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.
తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గతంలో అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారని, ఎవరికి భయపడి కెసిఆర్ ఇంట్లో కూర్చున్నారో చెప్పాలని బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అడిగిన కెసిఆర్ అధికారంలోకి రాగానే దాన్ని విస్మరించారని బిజెపి మరో నాయకుడు బద్దం బాల్ రెడ్డి అన్నారు.
గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో బిజెపి నాయకులు అటు బాపూ ఘాట్ వద్దకు, ఇటు గోల్కొండ కోట వద్దకు చేరుకోవడంతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది.