మునుగోడులో కాంగ్రెస్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి.. కాంగ్రెస్ వెనుకబడటానికి కారణాలివే!!
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల వాతావరణం ఇప్పటి నుండే కనిపిస్తుంది. మునుగోడు ఉపఎన్నిక తీసుకువచ్చిన పొలిటికల్ హీట్ రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో తాడోపేడో తేల్చుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి.
మునుగోడులో మూడో స్థానానికి పడిపోతున్న కాంగ్రెస్
ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల రేసులో బిజెపి, టిఆర్ఎస్ ఒకదానికొకటి బలమైన పోటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు, పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీని మూడవ స్థానానికి నెడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో, వ్యూహాత్మకంగా మునుగోడులో ఎత్తుగడలు వేయడంలో బిజెపి, టిఆర్ఎస్ బలంగా ఢీ కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రెండు పార్టీలకు గట్టిపోటీ ఇవ్వలేక పోతోంది.
ప్లాన్ పెద్దదే.. కానీ అమలులో వెనుకబడిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ నేతలలో సైతం తాము వెనుకబడ్డామన్న భావన వ్యక్తమవుతోంది. అటు బిజెపి, టిఆర్ఎస్ నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుండగా, కాంగ్రెస్ నేతల తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరిని కలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించినప్పటికీ, అమలులో మాత్రం కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందని టాక్ వినిపిస్తోంది. 1000 మందితో యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించగా, కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం లేకపోవడంతో, నేతలు పెద్ద ఆసక్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న వలసలు, సమన్వయ లేమి
రాష్ట్ర
స్థాయి
నుంచి
సరైన
పర్యవేక్షణ
సమన్వయం
లేకపోవడంతో,
కాంగ్రెస్
పార్టీ
నుండి
అభ్యర్థి
ఎవరు
అనేది
కూడా
ఖరారు
కాకపోవడంతో
కాంగ్రెస్
పార్టీ
నేతలు
గందరగోళంలో
ఉన్నట్లుగా
తెలుస్తుంది.
ఇక
ఇదే
సమయంలో
కాంగ్రెస్
పార్టీని
వలసలు
వేధిస్తున్నాయి.
టిఆర్ఎస్,
బిజెపి
కాంగ్రెస్
పార్టీలోనే
బలమైన
నాయకులకు
గాలం
వేసి,
తమ
పార్టీ
కండువా
కప్పే
పనిలో
బిజీగా
ఉంటే,
కాంగ్రెస్
పార్టీలో
వలసలను
ఆపడం
అతి
పెద్ద
టాస్క్
గా
మారింది.
పెద్ద
ఎత్తున
కాంగ్రెస్
పార్టీ
నుండి
వార్డు
సభ్యులు,
మండల
పార్టీ
అధ్యక్షులు,
మండల
స్థాయి
ప్రజాప్రతినిధులు
బీజేపీ,
టీఆర్ఎస్
పార్టీలో
చేరుతూ
ఉంటే
పార్టీ
శ్రేణులలో
మరింత
నిస్తేజం
అలుముకుంది.
కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ అయితేనే కాంగ్రెస్ ప్రచారం స్పీడందుకునే ఛాన్స్
ఈనెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇంకా క్షేత్ర స్థాయిలో కి వెళ్ళలేకపోయారు అనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తేలితే తప్ప కాంగ్రెస్ పార్టీలో ప్రచారం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి జగదీష్ రెడ్డి చాపకింద నీరులాగా పావులు కదుపుతూ ఉంటే, బిజెపి నుండి అభ్యర్థిగా ఫిక్స్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ప్రచారం మొదలుపెట్టారు. ఇక భారీ బహిరంగ సభలతోనూ అటు టిఆర్ఎస్, బిజెపి మునుగోడు ఉపఎన్నిక తమకు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పారు.
బహిరంగసభ ఏర్పాటులోనూ కాంగ్రెస్ వెనుకే.. అంతర్గత కలహాలు కాంగ్రెస్ కు మైనస్
ఇక బహిరంగ సభ ఏర్పాటులోనూ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు వెరసి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలలో ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడినట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఉనికి కోసం ఏ విధంగా పోరాటం చేయబోతోంది అనేది తెలియాల్సి ఉంది.