2023లో తెలంగాణలో కమలం పాగా వేస్తుంది..! బీజేపి మాజీ సీఎం శివరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు..!!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో బీజేపి ముందుకెళ్తోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. భారతీయ జనతా పార్టీ కి మద్దతు పలికినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల వారినీ బీజేపి లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. జులై 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారన్నారు. జులై 7 నుంచి ఆగస్టు 11 వరకు సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకు కాలం చెల్లిందన్న ఆయన.. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కు తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. పార్టీ విస్తరణలో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలంతా తెలంగాణ, బెంగాల్పై దృష్టి సారించారన్నారు.
Recommended Video
ఇదిలా ఉండగా నరేంద్ర మోదీ భారీ మెజార్టీతో వరసగా రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడాన్ని పురస్కరించుకొని అమెరికాలోని ప్రవాస భారతీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సాయిదత్త పీఠం వ్యవస్థాపకులు శ్రీ రఘు శర్మ ఆధ్వర్యంలో సాయిబాబాకు తమ మొక్కును సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని వారు ఆకాంక్షించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో తమ కార్యకర్తలు 1.4 మిలియన్ల ఫోన్ కాల్స్ చేసి బీజేపి కి ఓటు వేయాలని ప్రచారం చేశారన్నారు.