రక్తపాతానికి బీజేపీ భారీ కుట్ర -మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన -సర్వత్రా టెన్షన్..
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రభావం చూపేందుకు బీజేపీ భారీ కుట్రలకు తెరలేపిందని, దుబ్బాక సహా రాష్ట్రమంతటా రక్తపాతం జరిగేలా శ్రేణుల్ని ప్రోత్సహిస్తున్నదని మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

22 రోజులుగా కుట్రలు..
‘‘దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని బీజేపీ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. గత 22 రోజులుగా ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నింది. చివరికి డబ్బు పంచడానికి తీసుకెళఉతూ పట్టుపడింది. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలు, వారి బంధుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. తాజగా ఆదివారం హైదరాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బులు బీజేపీ నేతలవే అని పోలీసులు నిర్ధారించారు. తిమ్మిని బమ్మి చేయడం బీజేపీకి బాగా అలవాటు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే డబ్బులు దొరికాయన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై గోబెల్స్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నారు.

రక్తపాతం సృష్టించేలా..
దుబ్బాక బీజేపీ అభ్యర్థి చేయి విరిగిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ(ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం(నాంపల్లి) ఎదుట ఓ వ్యక్తి వ్యక్తి ఆత్మహత్యహత్నం చేసుకోవడాన్ని హైలైట్ చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు. ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రగతి భవన్,తెలంగాణ భవన్,డీజీపీ కార్యాలయం లాంటివి ఎంచుకొని ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. శాంతి భద్రతల విఘాతం కలిగేలా రక్తపాతం,లాఠీచార్జ్, ఫైరింగ్కు బీజేపీ ప్రోత్సహిస్తుంది.

ఈసీకి ఫిర్యాదు..
రక్తపాతం జరిగేలా బీజేపీ చేస్తోన్న కుట్రలు, తప్పుడు ప్రచారాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖను కూడా రాశాం. అలాగే రాష్ట్ర సీఈఓని కూడా కలవబోతున్నాం. అభ్యర్థికి చేయి విరిగిందని ఓసారి, అధ్యక్షుడిపై దాడి జరిగిందని మరోసారి చిల్లర నాటకాలు ఆడారు. కుట్రల ద్వారా దుబ్బాకలో ఓట్లు పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది'' అని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 3న(మంగళవారం) జరగనుంది. ఈనెల 10న ఫలితం వెలువడనుంది.












Click it and Unblock the Notifications