బీజేపీకి భవిష్యత్ లేదు.. రాజీనామా చేస్తూ కీలకనేత షాకింగ్ వ్యాఖ్యలు!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే బిజెపిలో మాత్రం గందరగోళం చోటుచేసుకుంది. బిజెపిలో రాష్ట్ర నాయకత్వం తీరుపై, అలాగే టికెట్ల కేటాయింపులో తమకు అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న బిజెపీ నేతలు ఒక్కొక్కరుగా బిజెపికి రాజీనామా చేసి వరుసషాకులు ఇస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి రాజీనామా చేసి కాంగ్రెస్ బాట పడితే, తాజాగా బీజేపీకి మరో కీలకనేత రాజీనామా ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బిజెపి గళాన్ని గట్టిగా వినిపించిన ఏనుగుల రాకేష్ రెడ్డి బిజెపికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తాను బిజెపి కోసం ఎంతగానో పనిచేశానని, పార్టీకి ఎంతో సేవలు అందించాలని, అయినప్పటికీ పార్టీ తన కష్టాన్ని గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించానని పేర్కొన్న రాకేష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి అధిష్టానం రావు పద్మా రెడ్డి కి టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక తాజాగా ఏనుగుల రాకేష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎలాగైనా బరిలో ఉండాలని భావించిన ఆయన గత కొంత కాలం నుండి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు.
అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన రాకేష్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. బిజెపికి భవిష్యత్ లేదని ఆయన పేర్కొన్నారు. బిజెపిలో యువతకు ఆదరణ లేదని, సిద్ధాంతాల పేరుతో యువతను బానిసలుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు.
సర్వేలు, ప్రజలు రాకేష్ రెడ్డి ని గుర్తించినా, పార్టీ గుర్తించకపోవడం బాధాకరమని వెల్లడించారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. దీంతో వరంగల్ బిజెపికి గట్టి దెబ్బ తగిలినట్లు అయింది. మరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఏం చేయబోతున్నారు? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications