కమ్యూనిస్టులపై బీజేపీ విసిరిన పాచికే... ఈసారి ఆ రాష్ట్రంలో.. ??
మూడు దశాబ్దాలపాటు కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి త్రిపుర రాష్ట్రాన్ని భారతీయ జనతాపార్టీ 2018 ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుచుకోగలిగింది. ఫలితాలు వెల్లడైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ''కొద్ది నెలలుగా రాష్ట్రాన్ని బీజేపీ ఆర్థిక దిగ్బంధనంలో ఉంచిందని, ఆర్థిక అలజడి సృష్టించడానికి ప్రయత్నించి రాష్ట్రంలో ఎదిగిందని'' చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు రాలేదని, పన్నుల వాటా విడులలో జాప్యం జరిగిందని, దీనివల్ల రాష్ట్రంలో అమలు చేయాల్సిన ప్రజా పనులు వాయిదాపడటంతోపాటు పథకాలు కూడా వెనక్కి వెళ్లాయన్నారు. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రబలి అది బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదపడిందనేది స్పష్టమైంది.

కేంద్రం నుంచి రూ.7800 కోట్లు రావాలి
ప్రస్తుతం ఇదే తరహా వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తోందని ఆర్థికవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన బిల్లులు రాకపోవడంతోపాటు పన్నుల్లో వాటా సైతం అందడంలేదు. తెలంగాణకు రావల్సిన రూ.7800 కోట్లు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. సెస్సుల పేరుతో 11 శాతం నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని కేసీఆర్ సర్కారు ఆరోపిస్తోంది. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు తెలంగాణను ఇబ్బంది పెడుతున్నాయి. ఎఫ్ బీఆర్ ఎం లిమిట్స్ దాటి అప్పులుచేయడానికి అనుమతి ఇవ్వడంలేదు.

రాష్ట్రంపై పట్టు పెరగాలంటే.. ఇదే మంచి తరుణం
రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు వీటి నిర్వహణ సరిగా లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం రాష్ట్రంపై తనకు పట్టుపెరగాలంటే ఇదే మంచి అవకాశం అని భావిస్తోంది. పథకాలు అమలవకపోవడంతోపాటు కొత్తవాటి రూపకల్పనకు అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం కనపడుతోంది. దీంతో అప్పుల కోసం తెలంగాణ సర్కార్ హైదరాబాద్ లో విలువైన స్థలాలను విక్రయించాలనే యోచనలో ఉంది. విలువైన స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించే పనిలో కీలక శాఖలకు చెందిన అధికారులున్నారు. వీటిద్వారా వచ్చిన సొమ్ముతో ఎన్నికలు జరిగేవరకు సర్దుబాటు చేసుకోవచ్చనే యోచనలో ప్రభుత్వం ఉంది.

కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వగలిగితే..
ధాన్యం సేకరణ జరిపిన రైతులకు కొంత నగదు చెల్లించాల్సి ఉంది. అలాగే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతోపాటు కొత్త పింఛన్లు కూడా ఇవ్వడంలేదు. ఇవి ఇస్తే ఈసారి ఎన్నికల్లో విజయానికి ఢోకా ఉండదని ఇటీవలే ప్రశాంత్ కిషోర్ కూడా ముఖ్యమంత్రికి సూచించినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications