అదే కేసీఆర్ ఓటమి: ఈటల రాజేందర్కు బీజేపీ స్వాగతం పలుకుతోందంటూ తరుణ్ చుగ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో యుద్ధం నడుస్తోందని.. అది ఆత్మగౌరవానికి , అహంకారానికి మధ్య నడుస్తుందన్నారు. శుక్రవారం తరుణ్ చుగ్ తోపాటు రాష్ట్ర బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, రాజా సింగ్, రఘునందన్ రావు, ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావు, ఏ చంద్రశేఖర్, వివేక్ తదితరులు శామీర్పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లారు. ఇక తన గన్మెన్కు రావడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హోం క్వారంటైన్లో ఉన్నారు. దీంతో ఆయన ఈటల నివాసానికి వెళ్లలేదు.
Recommended Video

ఈటల బీజేపీలోకి రాక.. అదే కేసీఆర్ ఓటమి..
ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడిపోవడమని అన్నారు. ఒక వ్యక్తి, అతని కుటుంబం చేస్తున్న అరాచకాల మీద ఈటల గొంతు వినిపించారన్నారు. ఇన్నాళ్లు ఈటల టీఆర్ఎస్ పార్టీలో సంఘర్షణ పడ్డారని, తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారన్నారు. ఈటల పోరటానికి బీజేపీ మద్దతు పలుకుతుందన్నారు.

కేసీఆర్ అహంకారం, రాజరికం పోవాలి..
కేసీఆర్, ఆయన కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్లుందన్నారు తరుణ్ చుగ్. తెలంగాణ లక్ష్యం వెనక్కిపోయిందన్నారు. కేసీఆర్ అహంకారం, రాజరికం తెలంగాణ నుంచి పోవాలనేది తమందరి ఉద్దేశమని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. తెలంగాణ వికాసం కోసం ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధమేనని అన్నారు. తమతో కలిసి పోరాటం చేసేందుకు ఎంత మంది వచ్చినా కలుపుకుని పోతామన్నారు. ఉద్యమకారుడు ఈటలకు బీజేపీ స్వాగతం పలుకుతోందన్నారు.

14న బీజేపీలోకి ఈటల.. ఢిల్లీ పెద్దల సమక్షంలో..
కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూన్ 14 బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని పార్టీ నేతలు అంటున్నారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తోపాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు. అంతకుముందే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications