రాహుల్ది ఏ కులం, ఏ మతం? రేవంత్ ఈ విషయం తెలుసా!?
ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం రేవంత్.. దేశ ప్రధానిపై నీచపు వ్యాఖ్యలకు దిగారంటూ మండిపడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ప్రధాని మోడీ కులంపై వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందన్నారు బండి సంజయ్. ఎందుకంటే.. 1994లో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోడీ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. . ఈ విషయాన్ని రేవంత్ మర్చిపోయారని మండిపడ్డారు.

మోడీ కులంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు? ఆయన మతం ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన కులం, మతం కూడా సీఎంకి తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తాత ఫీరోజ్ జహంగీర్ అని అన్నారు.
హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుందున్నారు బండి సంజయ్. ఇప్పుడు ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలనుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 10 జన్పథ్ నుంచి ప్రారంభించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దృష్టి మరలించాలని ప్రయత్నించినా.. అది పనిచేయదన్నారు. ఇప్పటికే బీజేపీ తరపున తమ నిర్ణయం చెప్పామన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని.. అలాంటి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
సీఎం పదవిని కాపాడుకునేందుకే.. రేవంత్కు మహేశ్వర్ రెడ్డి హెచ్చరిక
ప్రధాని మోడీ కులంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ ఖబడ్దార్.. ప్రధాని మోడీపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావంటూ దుయ్యబట్టారు. రేవంత్ తన సీఎం పదవిని కాపాడుకునేందుకు ప్రధాని మోడీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి బీసీ కులానికి చెందిన మోడీ ప్రధానిగా ఉండటం ఓర్వలేకే గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పుడు రేవంత్ కూడా రాహుల్ బాటలోనే నడుస్తూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మోడీపై రేవంత్ ఇలాగే మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, ఇతర బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. నరేంద్ర మోడీ కేబినెట్లో 17 మంది బీసీలు ఉన్నారని.. కానీ, రేవంత్ కేబినెట్లో ఇద్దరే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మోడీ కులాన్ని బీసీలో చేర్చారని గుర్తు చేశారు. కాగా, మోడీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేగాక, తాను దీనిపై పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications