ప్రధానిపై అసభ్యంగా మాట్లాడిన కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవహేళన చేస్తూ మాట్లాడటం తగదని రఘునందన్ రావు కెసిఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్ ఒక్క నిమిషం కూడా సీఎం కుర్చీలో కూర్చోవద్దని రఘునందన్ రావు మండిపడ్డారు.
దుబ్బాకలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం .. కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ నిరసన
ప్రధాని నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు రఘునందన్ రావు. ప్రధాని పై అసభ్యంగా మాట్లాడినందుకు సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తీరుపై దుబ్బాక లో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు బిజెపి నాయకులు. సిద్దిపేట పట్టణంలోని శివానుభవ మండపంలో ప్రధాని మోడీ వర్చువల్ ప్రసంగాన్ని బిజెపి నాయకులతో కలిసి వీక్షించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇక ఈ సమయంలో సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి
సీఎం కేసీఆర్ భాష సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. 70 వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకుంటున్న వ్యక్తికి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని రఘునందన్ రావు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ పై కేసీఆర్ మాట్లాడిన భాష అభ్యంతరకరమని, దేశ యువత కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన తెలపాలని రఘునందన్ రావు కోరారు. డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని రఘునందన్ రావు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు కెసిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కమ్యూనిస్టు నాయకులు స్పందించాలి
రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కమ్యూనిస్టు నాయకులు స్పందించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. కేసీఆర్ కు ప్రధాని కావాలనే కోరిక ఉంటే ప్రజలను ఒప్పించుకోవాలి కానీ ఈ విధంగా ప్రధానిపై బూతు పురాణం ద్వారా కాదని రఘునందన్ రావు కేసీఆర్ కు హితవు పలికారు.
ప్రధాని పై అసభ్యంగా మాట్లాడినందుకు సుమోటోగా కేసు నమోదు చెయ్యాలి
తెలంగాణా సీఎంతో పాటు గులాబీ పార్టీ నేతలు మోడీ గుజరాత్ కి మాత్రమే ప్రధాని అని విమర్శలు చేస్తున్నారని అలా అయితే తెలంగాణ గిరిజన యూనివర్సిటీకి నలభై నాలుగు కోట్లు ఎట్లా వచ్చాయో చెప్పాలంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు కెసిఆర్ ను నిలదీశారు. కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ నిధులను జిల్లాకు 53 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అన్ని నియోజక వర్గాలకు సమానంగా ఎందుకు పంచలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. కెసిఆర్ కి ప్రజలపై, వ్యవస్థలపై విశ్వాసం లేదని రఘునందన్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానిపై అసభ్యంగా మాట్లాడినందుకు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.