కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టాలనుకోవడం మూర్ఖత్వం; వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై రఘునందన్ రావు నిలదీత
తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్మరించిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు గుప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వేములవాడ ఆలయ అభివృద్ధి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పై వచ్చే బడ్జెట్ లో ప్రశ్నిస్తాం
తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లు వేములవాడ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదని రఘునందన్ రావు మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్ళు అన్నాడని, సిరిసిల్ల కు, వేములవాడకు ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పై వచ్చే బడ్జెట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను, కేటీఆర్ ను నిలదీస్తాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు .

యాదాద్రికో న్యాయం .. వేములవాడకో న్యాయమా?
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక న్యాయం వేములవాడ రాజన్న ఆలయానికి మరో న్యాయమా అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో కేవలం మాటలకే పరిమితం అయ్యారని, యాదాద్రిని అభివృద్ధి చేసినట్టు వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యలేదని అన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారో బయటపెట్టాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం భక్తుల కోసం ఎంత నిధులను ఖర్చు చేస్తుంది?
శివరాత్రి పేరిట హంగామా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం భక్తుల కోసం ఎంత నిధులను ఖర్చు చేస్తుందో చెప్పాలన్నారు. వీఐపీల కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. శివరాత్రి పేరుతో అధికారులు చేసే హంగామా కేవలం విఐపిల కోసమే చేస్తున్నారని, సామాన్య ప్రజల మాట ఏమిటని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. సామాన్య భక్తుల కోసం ఎటువంటి ఖర్చు చేయడం లేదని, సామాన్యులను పట్టించుకోవడంలేదని రఘునందన్ రావు ఆరోపించారు.

సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలేవీ?
శివరాత్రి జాతర సమయంలోఉన్న 550 వసతి గదుల్లో వీఐపీల కోసం 400 వసతి గదులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రి నరసన్న కు ఒక న్యాయం, వేములవాడ రాజన్న ఆలయానికి మరో న్యాయమా అంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ స్వయంగా వేములవాడ కు వచ్చి వేములవాడ రాజన్న చాలా శక్తివంతమైన దేవుడని, నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారని, ఎందుకు చేయలేదు చెప్పాలని రఘునందన్ రావు మండిపడ్డారు. లక్షలాదిగా భక్తులు వస్తున్న కనీస భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended Video

సీఎం కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టాలనుకోవడం మూర్ఖత్వం
ఏడాదికి 100 కోట్ల పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఆలయంలో భక్తులు సమస్యలు మాత్రం తీరడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టాలనుకోవడం మూర్ఖత్వం ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అసలు నియోజకవర్గానికి రాడని, స్థానిక ఆలయాన్ని ఏమాత్రం పట్టించుకోడని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధి పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications