ఆ దమ్ము కేసీఆర్ కు లేదు; దళితులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనమే: రాజా సింగ్ ఆగ్రహం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలే కాకుండా, ఇతర ప్రత్యర్ధి పార్టీల నేతలు కూడా తీవ్రస్థాయిలో కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు.
పాస్ పోర్ట్ బ్రోకర్,దుబాయ్ శేఖర్.. బూతుపురాణం మానుకోకపోతే కేసీఆర్ నాలుక తెగ్గోస్తాం: డీకే అరుణ
కేసీఆర్ తిట్లు తిట్టటం ఎలా అనే పుస్తకాలను మాత్రమే చదువుతారు
ఇక తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనమై పోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శాపనార్థాలు పెట్టారు. సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన దళితులే కేసీఆర్ ను కిందకు దించుతారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 70 వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే కేసీఆర్ తిట్లు తిట్టటం ఎలా అనే పుస్తకాలను మాత్రమే చదువుతారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్ కు లేదు
అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్ కు లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బడ్జెట్ గురించి మాట్లాడడానికి కాకుండా కేవలం బీజేపీని తిట్టడమే పనిగా కెసిఆర్ ప్రెస్ మీట్ లు పెడతారని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ దెబ్బకు కెసిఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చాడని, ప్రగతి భవన్ నుంచి రోడ్డు మీదకి ప్రజలు ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని కేసీఆర్ కు అర్థమైందని ఎమ్మెల్యే రాజా సింగ్ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ తాగకుండా మీడియా సమావేశం పెడితే తెలంగాణ ప్రజలు, మీడియా సీరియస్గా తీసుకునేవారని, కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణా బీజేపీ నేతల మండిపాటు
ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు సీఎం కేసీఆర్ తీరు పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి కెసిఆర్ కి లేదని మండిపడుతున్నారు. రాజ్యాంగం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ విషయంలో వామపక్షాలు స్పందించాలని, దళితులను అగౌరపరిచేలా కేసీఆర్ తీరు ఉందని విమర్శిస్తున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ అంటూ తిట్టిపోస్తున్న బీజేపీ నేతలు
ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు రఘునందన్ రావు. ప్రధాని పై అసభ్యంగా మాట్లాడినందుకు సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని రఘునందన్ రావు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు కెసిఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇక దుబాయ్ శేఖర్, పాస్ పోర్ట్ బ్రోకర్ అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చింది మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.