తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వద్దకు మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. ముందస్తు ఎన్నికలపై జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రజాప్రతినిధులు కేసీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వారు హైదరాబాదులో అటల్ బిహారీ వాజపేయి విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడనున్నారని తెలుస్తోంది.
వీరి మధ్య రాజకీయపరమైన చర్చ కూడా సాగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని పరిణామాలు, ముందస్తు ఎన్నికలు, జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే తన ఆలోచనలను కేసీఆర్ వారితో పంచుకున్నారని సమాచారం.
రాజకీయ చర్చలు జరగలేదు: డాక్టర్ కే లక్ష్మణ్
తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాదులో వాజపేయి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తాము కేసీఆర్ను కలవడానికి, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. వాజపేయి విగ్రహంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ముందస్తు ఆలోచన నేపథ్యంలో ప్రజాకర్షక పథకాలు ఉండే అవకాశముందని అంటున్నారు.
అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన, ఆమోదించాల్సిన అంశాలను త్వరగా అందించాలని అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను పరిపాలనా విభాగం కోరింది. ఈ మేరకు ఆయా శాఖల అధికారుల నుంచి సోమవారం సమాచారం వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం సమాచారం ఇచ్చి సాయంత్రానికల్లా వివరాలు కావాలని కోరడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు, త్వరలోనే అసెంబ్లీని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ కేబినెట్ భేటీ ప్రస్తుత ప్రభుత్వానికి చివరిది కానుందా అన్న చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకొని, ప్రగతి నివేదన సభ తర్వాత మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి రద్దుకు సిఫార్సు చేసే అవకాశముందని అంటున్నారు.