కేసీఆర్-ఈటెల..మధ్యలో బీజేపీ ఎంపీ: మారనున్న పొలిటికల్ ఈక్వేషన్స్కు సంకేతమా?
హైదరాబాద్: తెలంగాణలో రాత్రికిరాత్రి అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్.. వాటికి కేంద్రబిందువుగా మారారు. ఆయనపై భూ ఆక్రమణలు రావడం, వాటిని దర్యాప్తు చేపట్టడానికి విజిలెన్స్ విభాగానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించడం చకచకా సాగిపోయాయి. ఆ వెంటనే- ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే వార్తలు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆయనపై వేటు తప్పకపోవచ్చనీ అంటున్నారు.
ఈటెలకు అండగా బీజేపీ..అర్థమేంటీ?
ఈ పరిణామాలతో అధికార పార్టీలో ఏకాకిగా మారినట్లు భావిస్తోన్న ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ అండగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈటెలకు అనుకూలంగా కొందరు తెలంగాణ బీజేపీ నాయకులు గళం విప్పారు. ఆయనకు నైతికంగా మద్దతును ప్రకటిస్తున్నారు. సాధారణంగా- ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నయినా ప్రతిపక్షం గానీ, అధికార పార్టీ ప్రత్యర్థులు గానీ.. వ్యతిరేకించడం సర్వ సాధారణమే. ఈ విషయంలో మాత్రం.. అధికార పార్టీ సీనియర్ నాయకుడి కోసం బీజేపీ గొంతెత్తడం- రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలను పంపించినట్టయిందని అంటున్నారు.
సంక్షోభ సమయంలో అవసరమా?
టీఆర్ఎస్ అంటే ఒంటికాలి మీద లేచే బీజేపీ సీనియర్ నాయకుడు, నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్- మరోసారి తన విమర్శలకు పదును పెట్టారు. కేసీఆర్కు బుద్ధి లేదంటూ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి సహా ఆయన కేబినెట్ సహచరుల్లో ఎవరైనా పని చేస్తున్నారంటే.. అది ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమేనని అన్నారు. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ సమయంలో దాని బారి నుంచి ప్రజలకు కాపాడటానికి ఈటెల రాజేందర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాజకీయ ప్రతీకారానికి ప్రజల ప్రాణాలు పణం
ఈ సంక్షోభ సమయంలో కేసీఆర్ చేసిన పనుల వల్ల ఈటెల రాజేందర్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్కేర్ వర్కర్లు తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి గురవుతారని అన్నారు. దీనివల్ల కరోనా సంక్షోభ నివారణాచర్యలు కుంటుపడతాయని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రతీకారానికి ప్రజల ప్రాణాలను కేసీఆర్ పణంగా పెడుతున్నారని విమర్శించారు. ఆక్రమించిన భూమిలో ఎలాంటి షెడ్డూ కట్టలేదని ఈటెల రాజేందర్ చెబుతున్నారని, అలాంటిదేదైనా ఉంటే కూలగొట్టేస్తే సరిపోతుందని అన్నారు.
Recommended Video
విజయశాంతి సహా
ఇప్పటికే బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా ఈటెలకు అనుకూలంగా మాట్లాడారు. ఒక్కొక్కరే తమ గొంతును వినిపిస్తున్నారు. ఆయన అంగీకరించడమంటూ జరిగితే- తమ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇస్తోంది బీజేపీ. ఈటెల రాజేందర్కు సొంతంగా ఓటుబ్యాంకు ఉండటం, బీసీ నాయకుడు కావడం, కేసీఆర్ వైఖరిని బాగా తెలిసినవాడు కావడం, అధికార పార్టీలో లొసుగులు ఏవైనా ఉంటే.. వాటిని రాజకీయంగా వినియోగించుకోవడానికి ఈటెల సహకరించే అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ నాయకులు భావన.